ఢిల్లీ ఎన్నికలు: 55 రోజుల నిరసనలకు స్మాల్ బ్రేక్.. ఓటు వేసేందుకు కదిలిన షాహీన్ బాగ్
ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎముకలు కొరుకుతన్న చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఓటువేసేందుకు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే గత 55 రోజులుగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న షాహీన్బాగ్ కూడా స్వల్ప విరామం తీసుకుని ఓటింగ్లో పాల్గొంది. షాహీన్ బాగ్ ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడంతో నిరసనలు చేపడుతున్న ప్రాంగణం ఖాళీగా కనిపించింది.
ఓటు వేసేందుకు కదిలిని షాహీన్బాగ్
షాహీన్బాగ్ ప్రాంతం ఓక్లా నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గంకు చెందిన జనాభా ఎక్కువ. ఢిల్లీ ఎన్నికల ప్రచారం అంతా షాహీన్బాగ్ కేంద్రంగానే జరిగింది. షాహీన్బాగ్ కేంద్రంగానే చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు, మాటలతూటాలు పేలాయి. ఆమ్ఆద్మీ పార్టీ, బీజేపీ, మరియు కాంగ్రెస్లు షాహీన్ బాగ్ కేంద్రంగా ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. ఇక ఓక్లా నియోజవకర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అమనతుల్లా బరిలో నిలుస్తుండగా.. కాంగ్రెస్ నుంచి పర్వేజ్ హష్మీ, బీజేపీ నుంచి బ్రహ్మ్ సింగ్ బిదూరీలు పోటీలో ఉన్నారు.
గట్టి భద్రతా ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
ఎన్నికలకు కొద్ది రోజుల ముందు షాహీన్బాగ్లో తుపాకుల మోత మోగడంతో దేశం దృష్టి ఈ ప్రాంతంపై పడింది. ఇక షాహీన్ బాగ్లో ఐదు పోలింగ్ కేంద్రాలను వివాదాస్పదమైన కేంద్రాలుగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఇందులో 40 పోలింగ్ బూతులను అత్యంత వివాదాస్పదంగా ఈసీ గుర్తించింది. ఇక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. షాహీన్బాగ్ నిరసనకారులతో నిరంతరం టచ్లో ఉన్నామని కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీసీపీ ఆర్పీ మీనా చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు సహకరించాలని కోరినట్లు ఆయన చెప్పారు. అదనపు బలగాలను షాహీన్బాగ్లో మోహరించినట్లు డీసీపీ చెప్పారు. ఢిల్లీ పోలీసులతో పాటుగా పారామిలటరీ దళాలు, హోమ్గార్డులు కూడా ఉన్నారని వెల్లడించారు.
ఓటు హక్కును విధిగా వినియోగించుకుంటాం: షాహీన్బాగ్ వాసులు
ఇక షాహీన్బాగ్లో ఓటర్లు ఓటు వేసేందుకు ఉత్సాహంగా కదిలారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిలో ఓటు వేయాలంటూ నిరసనల్లో పాల్గొన్న మహిళలు పిలుపునిచ్చారు. ఓటు వేయడం తమ హక్కు అని చెప్పిన మహిళలు ఆ హక్కును విధిగా వినియోగించుకుంటామని చెప్పారు. గత రికార్డులు చెదిరిపోయేలా పెద్ద ఎత్తున వచ్చి ఓట్లు వేస్తామని మహిళలు చెప్పారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఓటర్లు ఈవీఎంపై కసితో ఓటు నొక్కితే దాని ప్రభావం షాహీన్బాగ్లో కనిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
షాహీన్బాగ్ నిరసనల్లో ఎక్కువగా పాల్గొంది తాతలు అవ్వలే కావడం విశేషం. వారంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారికోసం ప్రత్యేకంగా ఈ-రిక్షాలను ఏర్పాటు చేశారు స్థానికులు. నిరసనలు జరిగే ప్రాంతం నుంచి పోలింగ్ కేంద్రాల వరకు వీరిని రిక్షాలో తరలిస్తారు.