కాంగ్రెసుకు చావుదెబ్బ: పార్టీ పదవికి అజయ్ మాకెన్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెసు చావు దెబ్బ తిన్నది, ఎన్నికలకు దూరంగా ఉండడం ద్వారా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పరువు దక్కించుకున్నారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల సారథ్య బాధ్యతను అజయ్ మాకెన్కు అప్పగించినప్పటికీ ఫలితం ఏ మాత్రం దక్కలేదు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని అజయ్ మాకెన్ నిర్ణయించుకున్నారు.
ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని, తన సీటును కూడా గెలుచుకోలేకపోయానని, అందువల్ల బాధ్యత తనదేనని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి, తన రాజీనామా లేఖను అందిస్తానని ఆయన చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేని స్థితికి చేరుకుంది.
మాకెన్ ఢిల్లీలో సదర్ బజార్ సీటు నుంచి పోటీ చేశారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ, బిజెపి అభ్యర్థుల కన్నా వెనకబడి ఉన్నారు. ఆయన మూడో స్థానంలో ఉన్నారు. దీంతో ఆయన విజయం సాధించడమనేది జరిగే పని కాదని తేలిపోయింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను సాధిస్తోంది. ఎగ్జిట్ పోల్ సర్వేలను మించి అది విజయాలను అందుకుంటోంది. 70 సీట్లున్న అసెంబ్లీ స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకుని తిరుగులేని విజయానికి ఆప్ చేరువైంది. బిజెపి 7 సీట్లలో మాత్రమే ఆధిక్యతలో ఉంది.