ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ 2020: హస్తానికి హ్యాండ్ ఇచ్చిన ఓటర్లు.. మరోసారి కాంగ్రెస్ ఫ్లాప్ షో
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ క్రమంగా రావడం మొదలయ్యాయి.ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపారని చెబుతున్నాయి. ఢిల్లీని ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మెజార్టీ ఓటర్లు మొగ్గు చూపారు. 50 నుంచి 52 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
సానుకూల ప్రచారమే కేజ్రీవాల్కు
ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ మంత్ర అరవింద్ కేజ్రీవాలే అని చెప్పక తప్పదు. తను ప్రచారంలో వ్యవహరించిన తీరే అతనికి శ్రీరామ రక్షగా నిలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదితో పోల్చినప్పుడు ఆయన చూపిన విజ్ఞతే ఆయన్ను మళ్లీ కింగ్గా నిలబెట్టిందని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ యువతకు నాణ్యమైన విద్య అందించినందుకు తాను ఉగ్రవాదితో పోలుస్తున్నారా లేక ఢిల్లీకి సురక్షితమైన తాగు నీరు అందించినందుకు ఉగ్రవాదితో పోలుస్తారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆప్వైపు
ఇక సుదీర్ఘంగా ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ మాజీ సీఎం షీలా దీక్షిత్ మృతితో ఆ పార్టీ పూర్తిగా నిస్తేజంలోకి కూరుకుపోయింది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత కొన్ని విబేధాలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక 2015లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ఖాతా తెరవలేకపోయింది. అంతేకాదు కాంగ్రెస్ ఓటు బ్యాంకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మరలడం ఆ పార్టీకి ఆ సమయంలో పెద్ద దెబ్బ.
ఆకట్టుకోలేకపోతున్న కాంగ్రెస్
2020 ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఒకటి రెండు చోట్ల ఖాతా తెరిచే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఉంచిన సంక్షేమ పథకాలు బాగానే ఉన్నప్పటికీ అవి ఢిల్లీ ప్రజలను ఆకట్టుకోలేకపోయాయనే విషయం ఎగ్జిట్ పోల్స్ను చూస్తే అర్థమవుతోంది.
బీజేపీ నాయకుల తీరే
ఇక బీజేపీ ఢిల్లీలో వెనకబడి ఉందంటే అందుకు కారణం ఆ పార్టీ నాయకులే అని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి దిగినా సామాన్యుడి ముందు నిలవలేకపోయారని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అర్థమవుతోందని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు.