డెత్ వారెంట్: జనవరి 22.. ఉదయం 7 గంటలకు: తీహార్ జైలులో నిర్భయ కామాంధులకు ఉరి..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషులుగా గుర్తించిన నలుగురు కామాంధులకు ఈ నెల 22వ తేదీన ఉరిశిక్షను విధించనున్నారు. ఉదయం 7 గంటలకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి శిక్షను అమలు చేయనున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం మంగళవారం సాయంత్రం డెత్ వారెంట్ ను జారీ చేసింది.
నలుగురికీ ఒకేసారి..
నిర్భయపై అత్యాచారానికి పాల్పడిన ఆరుమందిలో నలుగురు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆరుమందిలో రామ్ సింగ్ అనే దోషి ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ గా తేలడంతో మూడేళ్ల జువైనల్ శిక్షను అనుభవించి, విడుదలయ్యాడు. ఇక మిగిలిన నలుగురిలో అక్షయ్ కుమార్ సింగ్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ కుమార్, వినయ్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు ఇదివరకే వారికి సుప్రీంకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసినప్పటికీ.. న్యాయపరమైన చిక్కుల వల్ల సాధ్యం కాలేదు.
ఆశాదేవి పిటీషన్ మేరకు
నిర్భయపై అత్యాచారానికి పాల్పడి ఏడేళ్లు పూర్తయినప్పటికీ.. నిందితులు ఇంకా జీవించే ఉన్నారంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నేటికి వాయిదా.. తీహార్ జైలులో ఉంటోన్న నలుగురికీ ఉరిశిక్షను విధించడానికి అవసరమైన డెత్ వారెంట్ యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలంటూ కిందటి నెలలో నిర్భయ తల్లి ఆశాదేవి పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారణను జనవరి 7వ తేదీకి వాయిదా వేసింది న్యాయస్థానం. ఆ తేదీ రానే వచ్చింది.
డెత్ వారెంట్ జారీ..
మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఈ పిటీషన్ పై న్యాయస్థానం పునర్విచారణ చేపట్టింది. అనంతరం డెత్ వారెంట్ ను జారీ చేసింది. నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్ కుమార్ సింగ్ కు సుప్రీంకోర్టు రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరే అవకాశం కల్పించిన నేపథ్యంలో.. అతని వైఖరేమిటనేది వెల్లడించాలంటూ తీహార్ జైలు అధికారులకు న్యాయమూర్తి సతీష్ అరోరా నోటీసులను జారీ చేయడం వల్ల డెత్ వారెంట్ ను మంజూరు చేయడంలో జాప్యం చోటు చేసుకుంది.
మీడియాను బయటికి వెళ్లమని ఆదేశించి..
పటియాలా హౌస్ న్యాయస్థానం న్యాయమూర్తి సతీష్ అరోరా ఈ డెత్ వారెంట్ను జారీ చేశారు. డెత్ వారెంట్ను జారీ చేసే సమయంలో న్యాయమూర్తి.. మీడియా ప్రతినిధులందరినీ బయటికి వెళ్లాలని ఆదేశించారు. ఆ తరువాతే ఆయన డెత్ వారెంట్ను జారీ చేశారు. అందులోని వివరాలను చదివి వినిపించారు. ఆశాదేవి పిటీషన్పై విచారణ కొనసాగుతున్న సమయంలో మీడియా ప్రతినిధులు కోర్టు హాలులోనే ఉన్నారు. విచారణ ముగిసిన తరువాత డెత్ వారెంట్ అంశాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చిన సమయంలో ఆయన మీడియా ప్రతినిధులను బయటికి వెళ్లాలని ఆదేశించారు.