మరో ‘పరువు హత్య’: కూతురి మతాంతర ప్రేమ.. ప్రియుడిపై ప్రతీకారం తీర్చుకున్న కుటుంబం!
న్యూఢిల్లీ : తన కుమార్తె ఇతర మతానికి చెందిన యువకుడిని ప్రేమిస్తోందని గ్రహించిన ఓ కుటుంబం.. పరువు కోసం ఆమె ప్రేమిస్తోన్న యువకుడిని గొంతు కోసి హతమార్చిన ఉదంతం దేశ రాజధాని న్యూఢిల్లీలో వెలుగుచూసింది.
పశ్చిమ ఢిల్లీలోని రఘువీర్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం యువతి(20)ని ఫోటోగ్రాఫరుగా పనిచేస్తున్న అంకిత్ సక్సేనా(23) అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. గత మూడేళ్లుగా వారు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
అయితే యువతి కుటుంబం మాత్రం వారి ప్రేమను అంగీకరించలేదు. కారణం.. ఆ యువకుడు వారి మతానికి చెందినవాడు కాకపోవడమే. కూతురి చేష్టలతో తన కుటుంబ పరువు పోతోందని ఆమె కుటుంబ సభ్యులు భావించారు.
మొదట తన కుమార్తెను ప్రేమిస్తోన్న అంకిత్ను యువతి కుటుంబ సభ్యలు హెచ్చరించారు. అయినా ఆ ప్రేమికుల మధ్య సంబంధం కొనసాగుతూనే ఉంది. దీంతో ఇక లాభం లేదని, నలుగురికి తెలిసి తమ పరువు పోతోందని, ఏదో ఒకటి చేయాలని యువతి కుటుంబం నిశ్చయించుకుంది.
గురువారం రాత్రి అంకిత్ను పిలిచి మళ్లీ యువతి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారి నడుమ వాగ్వాదం చోటు చేసుకుంది. అంతే.. ఆగ్రహం పట్టలేక యువతి తల్లిదండ్రులు, తమ్ముడు, మామ కలిసి అంకిత్పై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. ఆ యువతి మామ కత్తితో అతడి గొంతు కోసేశాడు.
జరుగుతున్న గొడవను గమనించి అడ్డుకోబోయిన అంకిత్ తల్లిని ఆ యువతి తల్లి, ఆమె కుమారుడు అడ్డుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఆ యువతి అమ్మానాన్నలు, తమ్ముడు, మామపై కేసు నమోదు చేశారు.
ఆ యువతి తమ్ముడు మైనర్ కావడంతో అతడ్ని ఓ బాలనేరస్తుల గృహానికి తరలించారు. మిగిలిన నిందితులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటన అనంతరం ఒంటరి అయి, భయపడుతున్న ఆ యువతికి పోలీసు రక్షణ నడుమ ఓ సహాయ కేంద్రానికి తరలించారు.
'నేను అంకిత్ కోసం మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ఠాగూర్ గార్డెన్ వద్ద వేచి ఉన్నాను. అతడేమో తన మోటార్బైక్ తీసుకొచ్చేందుకు ఇంటికెళ్లాడు. ఈలోగానే నాకు కబురు అందింది.. అంకిత్ను ఎవరో కత్తితో పొడిచేశారని, మా నాన్న, మామలే ఈ దురాగతానికి ఒడిగట్టారు..' అని ఆ యువతి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది.