కరోనా అమానుషం: యువతిని బస్సులోంచి తోసేసి ప్రాణం తీశారు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పట్ల భయం వద్దు.. జాగ్రత్తలు తీసుకోండి అంటూ ప్రభుత్వాలు ఎంత మొత్తుకున్నా.. ప్రజలు మాత్రం జాగ్రత్తలను పక్కన పెట్టి భయాందోళనలతో అమానుష ఘటనలకు తెగబడుతున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగుచూసింది.
కరోనా లేదంటూ మొరపెట్టుకున్నా..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందని అన్షిక యాదవ్(19) తన తల్లితో కలిసి జూన్ 15న ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయల్దేరింది. యూపీ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులో ఎక్కింది. వీరు యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ చేరాల్సి ఉంది. అయితే, బస్సు బయల్దేరిన కాసేపటికే అన్షికకు కరోనా లక్షణాలున్నాయంటూ బస్సులోని కొంతమంది గోల చేశారు. ఈ క్రమంలో యువతితోపాటు తల్లిని బస్సు నుంచి దింపేయాలని డ్రైవర్, కండకర్పై ఒత్తిడి చేశారు. తనకు, తన తల్లికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని ఎంత మొరపెట్టుకున్నా బస్సులోని వారెవరూ కనికరించలేదు.
బస్సులోంచి తోసేయడంతో యువతి మృతి..
ప్రయాణికులు ఆందోళన చేయడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ఆ యువతిని బలవంతంగా కిందికి దింపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అన్షిక ప్రతిఘటించింది. ఈ క్రమంలో డ్రైవర్, కండక్టర్ తోసేయడంతో యువతి రోడ్డుపై పడిపోయింది. తీవ్రగాయాలపాలైన యువతి.. అరగంట తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఢిల్లీ-యూపీ యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసుల నిర్లక్ష్యం..
ఈ ఘటనపై అన్షిక తల్లి, ఇతర కుటుంబసభ్యులు మథుర పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.
ఆ తర్వాత ఢిల్లీ మహిళా కమిషన్ ఆదేశాలతో జులై 9న ఎప్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే, అన్షిక గుండెపోటుతో మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో పేర్కొన్నారు. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపించాలని మథుర ఎస్ఎస్పీని కోరింది. ఈ కేసును పర్యవేక్షించాల్సిందిగా రూరల్ ఎస్పీని ఆదేశించినట్లు ఎస్ఎస్పీ తెలిపారు.
Recommended Video
దుప్పట్టతో కొట్టి బస్సులోంచి తోసేశారు..
కాగా, ఘటనకు సంబంధించిన వివరాలను అన్షిక సోదరుడు విపిన్ యాదవ్ తెలిపాడు. అన్షిక కిడ్నీలో రాళ్లు చేరి కొంత కాలంగా బాధపడింది. దానికి చికిత్స తీసుకుంది. అంతకుమించి ఆమెకు వేరే ఆరోగ్య సమస్యలేమీ లేవు. ఆరోగ్యంగా ఉన్న మనిషి బస్సు నుంచి బయటపడగానే ఎలా మరణిస్తుందని ప్రశ్నించారు. డ్రైవర్ తన సీటు కింది దుప్పట్టను అన్షికపైకి విసిరేసి కిందకు తోసేశారని తెలిపాడు. తన సోదరి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.