ప్రైవేటు పాఠశాలలకు శుభవార్త! 15 శాతం ఫీజు పెంపునకు ప్రభుత్వం నిర్ణయం!
ప్రైవేటు పాఠశాలలకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 15 శాతం ఫీజు పెంచుకునేందుకు ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది.
న్యూఢిల్లీ: ప్రైవేటు పాఠశాలలకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 15 శాతం ఫీజు పెంచుకునేందుకు ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ అనుమతించింది.
7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల మేరకు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల జీతాలు 25 శాతం పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులపై కొంత భారం పడే అవకాశం కనిపిస్తోంది.
2017-18 విద్యా సంవత్సరంలో జూలై నెల నుంచి విద్యార్థుల ఫీజులను 15 శాతం పెంచుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు ఉత్తర్వులతో ఢిల్లీ నగరంలోని దాదాపు 300 ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు ఫీజులు పెరగనున్నాయి. అయితే తల్లిదండ్రులు మాత్రం ఏడాది మధ్యలో ఇలా ఫీజులు పెంచడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.