షారుఖ్ గుట్కా, పాన్మసాలా ప్రకటనల్లో నటించొద్దు
న్యూఢిల్లీ: క్యాన్సర్ వ్యాధికి కారణమవుతున్న గుట్కా, సుపారీ లాంటి పాన్ మసాలా వ్యాపార ప్రకటనల్లో నటించొద్దని షారుఖ్ఖాన్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, గోవిందా, సన్నీలియోన్, అర్భాజ్ఖాన్లతో పాటు బాలీవుడ్ ప్రముఖులను ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాసింది.
మనదేశంలో ప్రతిఏటా పొగాకు సంబంధిత ఉత్పత్తులతో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అలాంటి వారిని రక్షించడానికి పొగాకు ఉత్పత్తులకు వ్యతిరేకంగా నిర్వహించే ప్రచారంలో పాల్గొనాలని వీరికి ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
'పాన్మసాలా ఉత్పత్తులకు సంబంధించి టీవీ, వేరే ఇతర మీడియాలో వచ్చే ప్రకటనల్లో మీరు కనిపిస్తున్నారు. పాన్ మసాలాలో పొగాకు, నికోటిన్ లేకున్నా, వాటిలోని పోక వక్కలు క్యాన్సర్కు కారణమవుతున్నట్టు శాస్త్రీయ ఆధారాలు లభించాయి. పాన్ మసాలా పేరిట పొగాకు సంబంధిత వస్తువులను ప్రమోట్ చేసేలా పొగాకు ఉత్పత్తుల కంపెనీలు ప్రకటనలను రూపొందిస్తున్నాయి' అని ఢిల్లీ అడిషనల్ డైరెక్టర్ (హెల్త్) ఎస్కే ఆరోరా ఓ ప్రకటన జారీ చేశారు.
'యువతకు మీరు రోల్ మోడల్స్, వారు మీ లైఫ్ స్టైల్ను అలవాట్లను సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి ప్రకటనలు యువకులపై ఆకర్షిస్తాయని, ముఖ్యంగా పిల్లలు, మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి.' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి పాన్మసాలా, పొగాకు సంబంధిత వ్యాపార ప్రకటనల్లో దయచేసి నటించొద్దని ఆయన కోరారు.
ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం గుట్కా, సుపారీ లాంటి పాన్ మసాలా తయారు చేస్తోన్న పలు టుబాకో కంపెనీలపై కేసులు నమోదు చేసింది. దేశ రాజధానిలో పొగాకు ఉత్పత్తులను తరిమికొట్టేందుకు గాను ఢిల్లీ ప్రభుత్వం ప్రతినెలా చివరి రోజుని పొగాకు డ్రై డేగా ప్రకటించింది.