కొత్త నోటిఫికేషన్: అక్కడ ఆటోలో ప్రయాణిస్తే డబ్బులు ఎంత చెల్లించాలో తెలుసా..?
న్యూఢిల్లీ: సాధారణంగా నగరాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే సొంతవాహనం లేని వారు బస్సులోనో లేదా ఆటోరిక్షాలోనో వెళతారు. బస్సుకు వెళితే చార్జీలు తక్కువగా ఉంటాయి .అదే ఆటోరిక్షాలో ప్రయాణించాలని భావిస్తే కొంచెం కమ్ఫర్ట్గా ఉన్నప్పటికీ అధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఒక కిలోమీటరు దూరం వెళ్లాలంటేనే ఆటో డ్రైవర్ రూ.70 తీసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు నగరాల్లో కనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు ఆటో రిక్షావాలాలు వెయిటింగ్ ఛార్జీలు కూడా విధించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆటో రిక్షాలకు యమ డిమాండ్ ఉంటుంది. దీన్నే ఆ ఆటో డ్రైవర్లు ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్లు ప్రయాణికులపై ఛార్జీలు బాదుతున్నారు. ఇక రాష్ట్రరవాణా శాఖ ప్రస్తుతం ఉన్న రేట్ల పై 18.75శాతంను పెంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో కీలకంగా వ్యవహరించిన 90వేల మంది ఆటో డ్రైవర్లు లబ్ధిపొందనున్నారు. ప్రస్తుతం ఆటోలో వెళ్లాలంటే 2 కిలోమీటర్ల వరకు రూ.25గా ఉండేది. అయితే తాజా నోటిఫికేషన్తో అది 1.5 కిలోమీటర్లకే రూ.25 కానుంది. ఇక కిలోమీటరుకు రూ. 8 గా ఉన్న స్థితి నుంచి రూ.9.50కు పెంచడం జరిగింది. ఇక ఢిల్లీలోని ఆటో రిక్షాలకు సంబంధించిన అన్ని మీటర్లను ప్రస్తుత విధానానికి సరిచేస్తామని ఇందుకు 45 రోజుల సమయం పడుతుందని రవాణా శాఖ వెల్లడించింది.
గత వారం ఢిల్లీ రవాణా శాఖ ఓ ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆటో రిక్షాలకు సంబంధించి కొత్త ధరలను ఇందులో పేర్కొంది. ఇక నిమిషానికి రూ.0.75 విధిస్తున్నట్లు పేర్కొంది. అది కూడా ట్రాఫిక్ సిగ్నల్లో ఆటో ఇరుక్కున్నప్పటికీ దాని భారం అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై వెయిటింగ్ ఛార్జీ రూపంలో పడనుంది. ఇక లగేజీ ఛార్జీలు రూ.7.50గా విధించింది. అయితే నోటిఫికేషన్ ఎప్పుడో సిద్ధం అయినప్పటికీ విడుదలలో జాప్యం జరిగింది. లెఫ్ట్నెంట్ గవర్నర్ ఈ నోటిఫికేషన్కు ఆమోదం తెలపలేదనే కారణంతో అధికారులు దాన్ని నిలిపివేశారు. ఎట్టకేలకు లెఫ్ట్నెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో రవాణాశాఖా మంత్రి కైలాష్ గహ్లాట్ విడుదల చేశారు.