లిక్కర్ షాపుల్లో ఉల్లిపాయలు, బంగాళాదుంపల సేల్!
న్యూఢిల్లీ: ధరలను నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఓ కొత్త ఆలోచన చేసింది. రాజధానిలోని మద్యం దుకాణాల్లో ఉల్లిపాయలు, బంగాళాదుంప(ఆలుగడ్డ)లు అమ్మేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఆలోచనను అమలు చేసేందుకు ఢిల్లీ స్టేట్ ఇండస్ట్రీయల్ అండ్ ఇన్ఫ్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(డిఎస్ఐఐడిసి) సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రభుత్వాధికారి తెలిపారు.
మంగళవారం ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో జరిగిన అధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు సమాచారం. అంతేగాకుండా ఢిల్లీలోని 250 ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో హోల్ సేల్ ధరలకే ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అమ్మేందుకు తాత్కాలిక దుకాణాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.
దీనికి అదనంగా 25 ప్రదేశాలు, 33 ఎస్డిఎం ప్రాంతాల్లో ఢిల్లీ జల్ బోర్డ్ హోల్ ధరలకే కూరగాయలను అందించేందుకు సిద్ధమైంది. మిగితా డిపార్ట్మెంట్లతోపాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ 15 స్టాల్స్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్(పిడబ్ల్యూడి) 25 స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. కేటాయించిన స్థలాల్లో ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అమ్మేందుకు మూడు మున్సిపల్ కార్పొరేషన్స్ సిద్ధంగా ఉన్నాయి.
నేషనల్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎఫ్ఎఫ్సి) మూడు మొబైల్ వ్యాన్లను తిప్పుతూ సరుకులు అమ్మాలని నిర్ణయించింది. ఇప్పటికే 288 ఫెయిర్ ప్రైస్ షాప్(ఎఫ్పిఎస్)లను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 70 ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో రూ. 22కే కిలో అందిస్తున్నట్లు తెలిపారు. దీనికి అదనంగా 70 మొబైల్ వ్యాన్లలో 250 ప్రాంతాల్లో ప్రతీ రోజు సరుకులు అమ్మేందుకు నిర్ణయించినట్లు తెలిపారు.
ఢిల్లీలోని తమ 380 దుకాణాల్లో నో ప్రాఫిట్-నో లాస్ బేసిస్ మీద ఉల్లిపాయలు, బంగాళాదుంపలు అమ్మేందుకు తాము చర్యలు తీసుకుంటామని సమావేశంలో పాల్గొన్న సఫల్(ఎస్ఏఎఫ్ఏఎల్) వ్యాపార అధినేత తెలిపారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సమీక్షించనున్నారు.