ఆ రాష్ట్రంలో తగ్గిన కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య... ఆ మంత్రం ఫలించిందన్న ప్రభుత్వం
ఢిల్లీ: కరోనావైరస్ ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి లక్షల్లో మృతి చెందగా 20 లక్షలకు పైగా చికిత్స పొందుతున్నారు. భారత్లో కూడా అంతకంతకూ కేసులు పెరిగిపోతున్నాయి. మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటంతో ప్రభుత్వం సైతం అన్ని ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకుంటోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కఠిన ఆంక్షలు విధించారు. ఢిల్లీలోనే తొలికేసు వెలుగు చూసింది. మార్చి నెల రెండో వారంలో తొలికేసు ఢిల్లీలో వెలుగు చూసింది. ఇక ఢిల్లీ ప్రభుత్వం లాక్డౌన్ నేపథ్యంలో పలు రకాల ఆంక్షలు విధిస్తూ మరింత కఠినతరం చేసింది. దీంతో ఆదివారం నాటికి ఢిల్లీలో యాక్టివ్ కేసులు 1688 ఉండగా సోమవారం రోజుకు అది 1,603కి పడిపోవడంతో ప్రభుత్వం కాస్త ఊపిరి పీల్చుకుంది.
ఢిల్లీలో కరోనావైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య ఆదివారం నుంచి మంగళవారం వరకు క్రమంగా తగ్గిపోతుండటం ప్రభుత్వానికి కాస్త ఊరటనిస్తోంది. సోమవారం రోజున 1603గా నమోదైన యాక్టివ్ కేసులు మంగళవారం నాటికి 1498కి పడిపోయాయి. అంతేకాదు మంగళవారం రోజున 180 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు 75 తాజా కేసులు నమోదయ్యాయి. ఇక గత రెండు వారాలుగా ఢిల్లీలో కరోనావైరస్తో మరణాలు ఏవీ నమోదు కాలేదు. ఇప్పటి వరకు ఢిల్లీలో 47 మరణాలు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో యాక్టివ్ కేసులు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే సామాజిక దూరం అనేది కచ్చితంగా వర్కౌట్ అవుతోందని అభిప్రాయపడ్డారు.ఇక ఇది ఇలానే మరో రెండు వారాల పాటు కొనసాగితే ఈ మహమ్మారిపై కొంత వరకు విజయం సాధించిన వారం అవుతామని ఢిల్లీ సర్కార్ తెలిపింది.
ఇదిలా ఉంటే మంగళవారం రోజున మరో మూడు ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది. డెవిల్ ఎక్స్టెన్షన్, హరినగర్ ఎక్స్టెన్షన్లోని హర్ష్ విహార్, మందవాలిలోని కృష్ణ పురి ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ఢిల్లీ ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఢిల్లీలో మొత్తం 87 ప్రాంతాలను కంటెయిన్మెంట్ జోన్లుగా ఢిల్లీ సర్కార్ గుర్తించినట్లయ్యింది. ఈ ప్రాంతాల్లో రోజూ క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేస్తోంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ కంటెయిన్మెంట్ జోన్లలో దాదాపుగా 3.25 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.
Recommended Video