ఫ్రీ.. ఫ్రీ.. అంతా ఫ్రీ.. వాటర్ బిల్ కూడా మాఫీ... ఎన్నికల స్టంటేనా..?
న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీ బస్సు, మెట్రోల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో కీ డిసిషన్ తీసుకున్నారు. హస్తిన వాసుల మంచి నీటి బిల్లులను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. దేశ రాజధానిలో మంచినీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ తీసుకున్న సంచలన నిర్ణయం .. ఆమ్ ఆద్మీ పార్టీకి మేలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
హస్తిన ప్రజలకు సీఎం కేజ్రీవాల్ మరో వరం ప్రకటించారు. ప్రజల మంచినీటి బిల్లును మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. దీంతో దాదాపు 13 లక్షల మంది ప్రజలకు మేలు జరుగుతుందని భావించారు. అయితే ఎవరి ఇంట్లో మంచినీటి మీటర్ ఉందో వారికే మాఫీ వర్తిస్తుందని షరతు విధించారు. గతేడాది నవంబర్ 30 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు ఉన్న బిల్లులను మాఫీ చేస్తామని పేర్కొన్నారు. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు.
ఢిల్లీలో మంచినీటి కనెక్షన్లకు సంబంధించి ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్, జీ, హెచ్ క్యాటగిరీలుగా విభజించారు. మంచినీటి బిల్లుల మాఫీపై కేజ్రీవాల్ క్లారిటీ ఇచ్చారు. ఈ, ఎఫ్, జీ, హెచ్ కనెక్షన్లు ఉన్న పదిన్నర లక్షల మందికి వందశాతం బిల్లు మాపీ అవుతుందని పేర్కొన్నారు. ఏ, బీ క్యాటగిరీ వారికి మాత్రం 25 శాతం మాఫీ అవుతుందని .. వారు 75 శాతం బిల్లు కట్టాల్సిందేనని తెలిపారు. సీ క్యాటగిరీ వారు 50 శాతం వారు, మిగిలిన 50 శాతం మాఫీ అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే ఢిల్లీలో వాటర్ మీటర్ పెట్టుకొని వారు తీసుకోవాలని కోరారు. దీంతో ఢిల్లీ జల్ బోర్డు ఆర్థికంగా బలోపేతం అవుతుందని వివరించారు. జలబోర్డుకు రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. దీంతో ప్రజాసంక్షేమం కోసం మరిన్ని నిధులు ఖర్చుచేయొచ్చని తెలిపారాయన.