ఢిల్లీ కాలుష్యంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సిగపట్లు..!
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిని వాయు కాలుష్యంపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిగపట్లు పట్టుకుంటున్నారు. మితిమీరిన వాయు కాలుష్యానికి కారణం మీరంటే.. మీరేనంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఢిల్లీలో వాతావరణ కాలుష్యానికి పంజాబ్, హర్యానా రాష్ట్రాలే ప్రధాన కారణమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటన పంజాబ్, హర్యానా ప్రభుత్వంలో కలకలం పుట్టింది. దేశ రాజధానిలో కమ్ముకున్న విష వాయువులకు తమను బాధ్యులను చేయడం సరికాదంటూ ఆ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మండిపడుతున్నారు.
పగబట్టిన కాలుష్యం: దేశ రాజధాని అతలాకుతలం.. విమానాలపైనా ఎఫెక్ట్..!
హర్యానా, పంజాబ్ రాష్ట్రాలు ఢిల్లీని ఆనుకునే ఉంటాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వ్యవసాయం ఎక్కువ. పంట చేతికి అందిన తరువాత రైతులు.. ఎండుగడ్డి, ఇతర పంట వ్యర్థాలను కాల్చుతుంటారు. ఇది ఏటా జరిగే ప్రక్రియే. ఇలా కాల్చడం వల్ల ఏర్పడిన పొగ క్రమంగా ఢిల్లీని అలముకుంటోందని, వాహనాల నుంచి వెలువడే వాయు కాలుష్యం దీనికి తోడు కావడం వల్ల ఊపిరి పీల్చుకోలేని స్థితికి ఢిల్లీ వాతావరణం చేరుకుందనేది ఢిల్లీ ప్రభుత్వం వాదన. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా వెల్లడించారు. పంట వ్యర్థాలను విచ్చలవిడిగా కాల్చేలా పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులు రైతులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మండిపడుతున్నారు. కాలుష్యాన్ని నియంత్రించుకోవడానికి సరైన ప్రణాళికలు కేజ్రీవాల్ వద్ద లేవని, ఆయన వైఫల్యాలను తమ మీదు రుద్దుతున్నారని విమర్శించారు. ఎండుగడ్డి సహా ఇతర పంట వ్యర్థాలను కాల్చివేస్తోన్న రైతులపై 3000 రూపాయల జరిమానా విధిస్తున్నామని, ఇంతకంటే ఇంకేం చేయాలని అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తాము చేయాల్సిందంతా చేస్తున్నామని ఆయన వెల్లడించారు. వాహన కాలుష్యాన్ని నియంత్రించుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందని ఆయన నిలదీస్తున్నారు.
హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా ఇదే తరహాలో కేజ్రీవాల్ పై మండి పడ్డారు. కేజ్రీవాల్ వాదనలో పస లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో వాయు కాలుష్యానికి తమ రాష్ట్ర రైతులు కారణం అవుతున్నారంటే.. హర్యానాలో ఆ తరహా వాతావరణం ఎందుకు లేదని ప్రశ్నించారు. వాహన కాలుష్యాన్ని నియంత్రించడానికి ఢిల్లీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలే తప్ప.. తమ మీద ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు. వాయు కాలుష్యం నేపథ్యంలో గుర్ గావ్ లో పాఠశాలలు, విద్యాసంస్థలకు ఈ నెల 5వ తేదీ వరకు సెలవులను ప్రకటించినట్లు దుష్యంత్ చౌతాలా వెల్లడించారు.