ఢిల్లీ కాలుష్యం: నాసా చిత్రాల్లో ఇలా!.. ప్రమాదకర స్థాయికి చేరుకోవడం వెనుక
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సందర్భమిది. రాజధానిలో పొగమంచు, వాహన కాలుష్యానికి తోడు ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Recommended Video
మరో పంట కోసం పొలాన్ని సిద్దం చేసే క్రమంలో చాలావరకు రైతులు అప్పటికే ఉన్న పంట అవశేషాలను కాల్చివేస్తుంటారు. అక్టోబర్-2017 మధ్య కాలంలో పంజాబ్, హర్యానాలో ఇలా చాలావరకు పంట పొలాలను దగ్డం చేశారు. ఈ ప్రభావం ఢిల్లీ వాతావరణంపై కూడా పడింది. నార్త్ ఇండియాతో పాటు, పాకిస్తాన్కు కూడా దీని ప్రభావం విస్తరించింది.
పంట పొలాలను కాల్చినప్పుడు వెలువడే పొగ.. దుమ్ము, ధూళి, పరిశ్రమల ఉద్ఘారాలతో కలిసి దట్టమైన పొగమంచుగా మారుతోంది. గాలి తీవ్రత ఎక్కువగా ఉంటే.. ఇది చెదిరిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ అవకాశం లేకపోవడంతో నవంబర్ లో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా పరిణమించింది.
నవంబర్ 7,2017న ఢిల్లీ కాలుష్యానికి సంబంధించి 'మోడరేట్ రిసొల్యూషన్ ఇమేజింగ్ స్పెక్ట్రోరాడయోమీటర్' నాసా సాటిలైట్ కొన్ని చిత్రాలను బంధించింది. ఇక్కడ ఇచ్చిన చిత్రంలో 'హేజ్ (పొగమంచు)', 'ఫాగ్' అని పేర్కొన్న ప్రాంతంలో పొగమంచు ఎంత దట్టంగా కమ్ముకుపోయిందో గమనించవచ్చు. గాలిలో పేరుకుపోయిన దుమ్ము ధూళి కణాల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది.
ఇక పైన చూపించిన మరో చిత్రంలో రెడ్-బ్రౌన్ కలర్స్ ఎరోసల్ పొల్యూషన్(స్ప్రే తరహా కాలుష్యం) కమ్ముకుపోయినట్టు గమనించవచ్చు. లాహోర్, న్యూఢిల్లీ, లక్నో, కాన్పూర్ ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపిస్తోంది. ఇక మూడో చిత్రంలో 'పొగమంచు' మరింత దట్టంగా కమ్ముకుపోయి ఉండటాన్ని గమనించవచ్చు. నవంబర్ 8,2017వ తేదీన ఈ చిత్రాన్ని బంధించారు.
సాధారణ స్థాయిని మించి ప్రమాదకర స్థాయిలో ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతూనే ఉంది. నవంబర్8, 2017న ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుందని యూఎస్ దౌత్య కార్యాలయం ప్రకటించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం 1,010స్థాయిలో ప్రమాద ఘంటికలను మోగిస్తున్నట్టు తెలిపింది. సాధారణంగా అయితే 0 నుంచి 100వరకు ఎక్కడైనా కాలుష్యం ఉంటుంది. కానీ ఢిల్లీలో 1,010స్థాయికి చేరుకోవడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం.
కాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిపోవడంతో ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. అలాగే నగరంలోకి వచ్చే ట్రక్కులను కూడా నిషేధించారు. భవన నిర్మాణ ప్రాజెక్టులను తాత్కాళికంగా నిలిపేశారు. పార్కింగ్ ఫీజులను పెంచడం ద్వారా రోడ్డెక్కే వాహనాల సంఖ్యను తగ్గించాలనుకుంటున్నారు. కాలుష్య సమస్యలతో చాలామంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతుండటం ఆందోళ కలిగించే అంశం. ఢిల్లీలో కాలుష్య పరిస్థితిపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 'ఎమర్జెన్సీ' ప్రకటించింది.