అత్యాచార కేసు... ఆ 'టాటూ'తో ట్విస్ట్... నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు...
ఓ అత్యాచార కేసులో నిందితుడికి ఢిల్లీ హైకోర్టు 'టాటూ' ఆధారంగా బెయిల్ మంజూరు చేసింది. అతనిపై కేసు పెట్టిన మహిళ ముంజేతిపై టాటూను కోర్టు గమనించింది. నిందితుడి పేరునే ఆమె టాటూగా వేయించుకున్నట్లు గుర్తించింది. అయితే నిందితుడు బలవంతంగా తనకు ఆ టాటూ వేయించాడని ఆ మహిళ ఆరోపించింది. దీనిపై కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఈ కేసును విచారించిన సింగిల్ బెంచ్ జస్టిస్ రజనీష్ భట్నాగర్...'నా అభిప్రాయం ప్రకారం... టాటూ వేయడమనేది ఒక కళ... దానికి ఒక మెషీన్ అవసరం. ఒకవేళ ఆ మహిళా ఫిర్యాదుదారు ఆ సమయంలో ప్రతిఘటించి ఉంటే ముంజేతిపై టాటూ వేయడం అంత సులువేమీ కాదు.' అని పేర్కొన్నారు.
ఆ మహిళ తన పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం... ఆమె ఒక వివాహిత. నిందితుడు ఆమె నగ్న ఫోటోలు,వీడియోలతో బ్లాక్మెయిల్కు పాల్పడుతూ ఆమెను లొంగదీసుకున్నాడు. అలా గత మూడేళ్లుగా ఆమెను బలవంతపెడుతూ శారీరక కోర్కెలు తీర్చుకుంటున్నాడు. అతని బెదిరింపులకు,బ్లాక్మెయిలింగ్కు భయపడి మూడేళ్ల వరకూ ఆమె ఈ విషయాన్ని తన భర్తకు కూడా చెప్పలేదు. అంతేకాదు,నీవల్ల నా జీవితం నాశనమైంది కాబట్టి నన్ను నీవద్దే ఉండనివ్వాలని ఆమె అతన్ని కోరింది. అయితే అందుకు అతను ఒప్పుకోలేదు. దీంతో గతేడాది అతనిపై ఆమె అత్యాచార కేసు పెట్టింది. నిందితుడు తనను ఓ ఇంట్లో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం... 'నిజానికి నిందితుడు ఆమెను ఎక్కడా నిర్బంధించలేదు. ఆమెను నిర్బంధించినట్లు చెప్తున్న ఇంట్లో ఆమె చాలాకాలంగా నివసిస్తోంది. ఈ విషయాన్ని ఆమెకు ఇంటిని అద్దెకు ఇచ్చిన యజమానే చెప్పాడు.' అని కోర్టు వెల్లడించింది. అంతేకాదు, నిందితుడిని అరెస్ట్ చేసిన సమయంలో అతని సెల్ఫోన్ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా... అందులో ఆమెకు సంబంధించి ఎటువంటి నగ్న ఫోటోలు లేవని తేలిందని పేర్కొన్నది.
ఆ మహిళ ముంజేతిపై నిందితుడి పేరుతో టాటూ ఉండటాన్ని కోర్టు కీలకంగా పరిగణించింది. మరోవైపు నిందితుడి తరుపు న్యాయవాది ఆమె ఆ టాటూ వేయించుకున్న సమయంలో అతనితో కలిసి దిగిన సెల్ఫీలను కోర్టుకు సమర్పించారు. ఇద్దరూ గతంలో దండలు మార్చుకున్న ఫోటోలు,ఆయా ఉత్సవాల్లో కలిసి దిగిన ఫోటోలను కోర్టుకు ఇచ్చారు. ఇవన్నీ గమనించిన న్యాయస్థానం ఆ మహిళ పెట్టిన కేసుపై అనుమానం వ్యక్తం చేసింది. నిందితుడికి రూ.25వేలు పూచీకత్తు,షూరిటీపై బెయిల్ మంజూరు చేసింది.