కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. బార్ అసోసియేషన్లకు కూడా...
ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. పోలీసులు, లాయర్ల వైఖరిపై మండిపడింది. ఘటనపై కేంద్రప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ ప్రభుత్వం, ఢిల్లీ, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్లకు నోటీసులు జారీచేసింది.
నాలుగు కేసులు నమోదు..
పోలీసులు లాయర్ల గొడవకు సంబంధించి ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఘర్షణపై జిల్లా జడ్జీ, పోలీసులు, ఇద్దరు లాయర్లు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఘర్షణకు సంబంధించి వివరాలు తెలుసుకొనేందుకు శనివారం వేచి చూశాం, నాలుగు గంటలు చూసినా ఎలాంటి సమాచారం లేదు. ఇవాళ కూడా కూర్చొన్నా చెప్పే నాథుడే లేడని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనాస్థలాన్ని అడిషనల్ సెషన్స్ జడ్జీ పింకీ పరిశీలించారని.. లోక్ అదాలత్ కోసం ఇరు పక్షాలు అంగీకరించాయని, కానీ చివరి నిమిషంతో రద్దయిందనే విషయాన్ని కోర్టుకు తెలియజేశారు.
ఇవీ సెక్షన్లు
ఇరుపక్షాల ఫిర్యాదుకు సంబంధించి హత్యాయత్నం, పబ్లిక్ సర్వెంట్పై దాడి, పబ్లిక్ సర్వెంట్పై దూషణ, ఆస్తుల ధ్వంసం తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఘర్షణపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) కూడా ఏర్పాటు చేస్తున్నామని సమాచారం హైకోర్టుకు అందజేశారు.
28 మందికి గాయాలు
శనివారం నాటి ఘటనలో 20 మంది పోలీసులు, ఎనిమిది మంది లాయర్లు గాయపడ్డారు. 12 టూ వీలర్లు, ఒక పోలీసు వాహనం, ఎనిమిది జైలుకు సంబంధించిన వ్యాన్లు ధ్వంసమయ్యాయి. మరికొన్నింటికీ నిప్పంటించడంతో కాలిబూడిదయ్యాయి.
ఏం జరిగిందంటే..
తీస్ హజారీ కోర్టు వద్ద గల పార్కింగ్ విషయంలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణకు దారితీసిందని తెలుస్తోంది. కానీ లాయర్ల వాదన మరోలా ఉంది. కోర్టు ప్రాంగణంలో ఓ లాయర్ వస్తోండగా పోలీసు వాహనం ఢీ కొందని తీస్ హజారీ బార్ అసోసియేషన్ తెలిపింది. తమ ముందు కొందరు పోలీసులు లాయర్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారని.. దాడి చేశారని పేర్కొన్నారు. వెంటనే తాము కలుగజేసుకున్నామని వివరించారు. అలా.. వారి మధ్య మాటల నుంచి చేతల వరకు వెళ్లింది. లాయర్ను ఢీ కొన్న పోలీసు జీపును తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్లింది.