ఢిల్లీ హైకోర్టులో రతుల్కు చుక్కెదురు.. ఆగస్టా వెస్ట్లాండ్లో బెయిల్ ఇచ్చేందుకు నో
న్యూఢిల్లీ : ఆగస్టా వెస్ట్లాండ్లో మనీ ల్యాండరింగ్కు సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం కమలనాథ్ మేనల్లుడు రతుల్ పురికి ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఆగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో ఇప్పటికే రతుల్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురు కావడంతో .. ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు.
వీవీఐపీ చాపర్ల కొనుగోలులో అవినీతి జరిగిందనే ఆరోపణలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఈ క్రమంలో రతుల్పై అభియోగాలు నమోదయ్యాయి. తనకు బెయిల్ ఇవ్వాలని కోరగా .. జస్టిస్ సునీల్ గౌర్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. రతుల్ తరఫున అభిషేక్ మను సింగ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసు విచారణకు సంబంధించి రతుల్ సహకరిస్తారని పేర్కొన్నారు. అయితే మను సింగ్వీ వాదనలపై ఈడీ తరఫు వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ అమన్ లేఖి తప్పుపట్టారు.
ఈ కేసు విచారణ సందర్భంగా రతుల్ సహకరించలేదని .. ఇప్పుడు బెయిల్ ఇస్తే దర్యాప్తు సంస్థల విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా ఇతర సాక్షులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. రతుల్కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. యూపీఏ హయాంలో ఆగస్ట్ వెస్ట్లాండ్ చాపర్ల కొనుగోలులో అవినీతి జరిగిందని వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.