సోనియా, రాహుల్కు ఊరట: క్రిమినల్ చర్యలపై కోర్టు స్టే
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బుధవారం ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆ ఇద్దరిపై క్రిమినల్ చర్యలను కోర్టు ఆగస్టు 13 వరకు నిలిపివేసింది. సోనియా, రాహుల్లు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు గత వారం భారతీయ జనతా పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మూతపడిన నేషనల్ హెరాల్డ్ దినపత్రికను ప్రచురించే ఒక కంపెనీకి చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై తమకు సమన్లు జారీ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఆగస్టు 5నాటికి నోటీసులకు సమాధానాలు అందజేయాలని జస్టిస్ విపి వైశ్ స్వామిని, ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఆగస్టు 7న కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ గత జూన్ 26న సోనియా, రాహుల్తో పాటు కాంగ్రెస్ కోశాధికారి మోతీలాల్ వోరా, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ ఫెర్నాండెజ్కు, సోనియా, రాహుల్కు వాటాలున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లు సుమన్ దూబే, శామ్ పిట్రోడాలకు గత జూన్ 26న సమన్లు జారీ చేసింది.
ట్రయల్ కోర్టు సమన్లను, బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలంటూ వోరా కూడా సోనియా, రాహుల్తో పాటుగా హైకోర్టును ఆశ్రయించారు. సుబ్రహ్మణ్య స్వామి ఒక రాజకీయ ప్రత్యర్థి అని, రాజకీయ ప్రయోజనాలను పొందడం కోసమే ఆయన తమపై ఈ కేసు పెట్టారని కాంగ్రెస్ నాయకులు తమ పిటిషన్లో ఆరోపించారు.