ఆయుష్మాన్ భారత్ వర్సెస్ ఆరోగ్య పథకం : తమ స్కీం పదిరెట్లు మేలన్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలతో విపక్షాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి అడ్డుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఎన్నికలకు ముందు బీరాలు పలికిన నేతలు .. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ .. తమ ప్రాబల్యాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంపై విమర్శల పర్వానికి మరింత పదునుపెట్టారు.
ఆరోగ్య పథకమే భేష్ ..
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం .. దేశంలో పేదల వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఢిల్లీలో కూడా పేదల వైద్యం కోసం కేజ్రీవాల్ సర్కార్ ఆరోగ్య పథకం ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయొద్దని అందులో కోరారు. ఒకవేళ మీరు ఈ పథకాన్ని అమలుచేస్తే ప్రజలు అంతకంటే మెరుగైన ఢిల్లీ ప్రభుత్వ పథకాన్ని కోల్పోతారు అని ప్రస్తావించారు. ఇప్పటికే మంచి పథకం పేదలకు అందుతున్నందున మరో పథకం ప్రవేశపెట్టడంలో ప్రయోజనం ఏం ఉండదని అభిప్రాయపడ్డారు. ఒకవేళ మీ అధికారంతో ఢిల్లీ ఆరోగ్య పథకాన్ని నిలిపివేసి .. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తే ... ప్రజలకే నష్టం కలుగుతుందని లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
10 రేట్లు బెటర్
ఢిల్లీ ఆరోగ్య పథకంలో ఏమైనా లోపం ఉందా అని కూడా ప్రశ్నించారు కేజ్రీవాల్. పేదలకు సరైన ఆరోగ్య సేవలు అందడంలో లోటుపాట్లు ఉంటే తెలియజేయాలని సూచించారు. కానీ వాస్తవానికి ఆయుష్మాన్ యోజన కన్నా .. ఢిల్లీ ఆరోగ్య పథకం పదిరేట్లు మేలని అభిప్రాయపడ్డారు. దీంతో పేద ప్రజలకు సరైన ఆరోగ్య సేవలు అందుతున్నాయని మరోసారి గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంం నెలకు రూ.10 వేల లోపు ఆదాయం ఉన్నవారికే వర్తిస్తుందని పేర్కొన్నారు. అలా అయితే రోజు కూలీ పనిచేసే వారి పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. ఢిల్లీలో వారి సంఖ్య ఎక్కువని .. వారందరినీ ఏం చేస్తారని ప్రశ్నించారు కేజ్రీవాల్. తమ పథకంతో ఢిల్లీలో 2 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని గుర్తుచేశారు.
30 లక్షలు
అంతేకాదు ఆయుష్మాన్ భారత్ రూ5 లక్షల వరకే వైద్య ఖర్చులు భరిస్తోందని పేర్కొన్నారు. అంతకుమించి రోగికి ఖర్చు చేయాల్సి వస్తే .. సొంత జేబు నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. కానీ ఢిల్లీ ఆరోగ్య పథకం అలా కాదని స్పష్టంచేశారు. రోగికి రూ30 లక్షల వరకు వైద్య సాయం అందిస్తున్నామని తెలిపారు. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం కొనసాగుతున్న ఢిల్లీ పక్క రాష్ట్రాల వారు కూడా వైద్యం కోసం .. ఢిల్లీ ఆస్పత్రులకు వస్తున్నారని గుర్తుచేశారు. అంటే ఎవరి వైద్యం బాగుందో ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇటీవల ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేయడం లేదని కేజ్రీవాల్పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించడంతో ఈ మేరకు ఢిల్లీ సీఎం లేఖ రాశారు.