వారంలోగా నివేదిక ఇవ్వండి: చిదంబరం కేసులో సీబీఐకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్రమంత్రి చిదంబరం బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణ చేసింది. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణ పరిస్థితిని, కేసుకు సంబంధించిన స్టేటస్ను వారం రోజుల సమయంలో కోర్టుకు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఇక జ్యుడీషియల్ కస్టడీకి సంబంధించి దాఖలు చేసిన రెండో పిటిషన్ను చిదంబరం న్యాయవాది ఉపసంహరించుకున్నారు.
బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ను ఫైల్ చేయడంలో జాప్యం ఎందుకు వహించారని కోర్టు ప్రశ్నించింది. గురువారం జ్యుడీషియల్ కస్టడీ విధించగా బెయిల్ కోసం ఈ రోజు ఎందుకు దరఖాస్తు చేస్తున్నారని జడ్జి ప్రశ్నించారు. కోర్టుకు సెలవుదినాలు ఉండటంతో సాధ్యపడలేదని అందుకే బుధవారం అన్ని పిటిషన్లు దాఖలు చేసినట్లు చిదంబరం తరపున న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.
ప్రస్తుతం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు. ఫారిన్ ప్రమోషన్ బోర్డు నుంచి ఐఎన్ఎక్స్ మీడియాకు క్లియరెన్స్ లభించడంలో కొన్ని అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలను చిదంబరం ఎదుర్కొంటున్నారు. 2007లో రూ.305 కోట్లు మేరా అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది.ఆ సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా చిదంబరం ఉన్నారు. గతనెలలో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో చిదంబరంను సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత విచారణ నిమిత్తం ఆయన్ను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఇక మనీలాండరింగ్ కేసులో చిదంబరంను ఈడీ కస్టడీలోకి తీసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది.