మీడియాపై రకుల్ ప్రీత్ గుస్సా: దర్యాప్తు ఆపాలంటూ: న్యూస్ ఛానళ్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ: టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్కు కోపం వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ డెత్ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ డ్రగ్స్, డ్రగ్స్ పెడ్లర్లతో ఉన్న లింకులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ సింగ్ రాజ్పుత్ సన్నిహితురాలు రియా చక్రవర్తి సహా పలువురు అరెస్టు అయ్యారు. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యురో (ఎన్సీబీ) నుంచి నోటీసులనూ అందుకున్నారు. అటు శాండల్వుడ్లోనూ డ్రగ్స్ కేసు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు అరెస్టు అయ్యారు. విచారణను ఎదుర్కొంటున్నారు.
Recommended Video
చైనా వైరాలజిస్ట్కు షాక్: కరోనా గుట్టురట్టు: నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకేనా?
రకుల్ పేరు ఉందంటూ..
సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, సైమోన్ ఖంబట్ట పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. విచారణ సందర్భంగా రియా చక్రవర్తి ఆ ముగ్గురి పేర్లను వెల్లడించినట్లు నార్కొటిక్స్ కంట్రోల్ అధికారులు వెల్లడించారు. వారికి ఇంకా సమన్లను జారీ చేయాల్సి ఉందని తెలిపారు. అదే సమయంలో- రకుల్ ప్రీత్ సింగ్ ఉందంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అన్ని జాతీయ, ప్రాంతీయ భాషలకు చెందిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యేక కథనాలు వెల్లువెత్తాయి.
ఢిల్లీ హైకోర్టులో పిటీషన్..
దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసహనానికి గురి అయ్యారు. తన విషయంలో మీడియా సొంతంగా దర్యాప్తు సాగిస్తున్నట్లు కనిపిస్తోందంటూ ఆమె మండిపడ్డారు. తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మీడియా కథనాలను నియంత్రించేలా, ట్రయల్స్ను అడ్డుకునేలా ఆదేశాలను ఇవ్వాలంటూ విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు రకుల్ ప్రీత్ సింగ్ తరఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు.
సమాచార శాఖ మార్గదర్శకాలకు భిన్నంగా..
డ్రగ్స్ కేసులో తన పేరు ఉందంటూ మీడియాలో కథనాలు రావడం సరికాదని పేర్కొన్నారు. ఉద్దేశపూరకంగా కథనాలు రాస్తున్నారని, వాటిని ప్రసారం చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అవన్నీ సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నియమ, నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. సమాచార, ప్రసారాల శాఖ రూపొందించిన మార్గదర్శకాలను నిర్ద్వందంగా ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టమౌతోందని పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) తనకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, అయినప్పటికీ మీడియా తనను వేధింపులకు గురి చేస్తోందని వివరించారు.
కేంద్రం, ప్రసారభారతి, న్యూస్ బ్రాడ్కాస్టర్ల అసోసియేషన్కు..
తనపై అసత్య సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారనీ పేర్కొన్నారు. ఈ పిటీషన్ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలను ఇచ్చింది. రకుల్ ప్రీత్ దాఖలు చేసిన పిటీషన్పై శరవేగంగా స్పందించాలని పేర్కొంది. ఈ పిటీషన్ను వినతిపత్రంగా భావించాలని సూచించింది. రకుల్ ప్రీత్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్పై తాము ఏవైనా మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయక ముందే వేగంగా నిర్ణయాన్ని తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కేంద్రంతోె పాటు ప్రసారభారతి, న్యూస్ బ్రాడకాస్టర్ల అసోసియేషన్కూ ఈ ఆదేశాలను జారీ చేసింది.