ట్రబుల్ షూటర్ డీకే. శివకుమార్ కు షరతులతో బెయిల్, పాస్ పోర్టు ఇవ్వండి, జైల్లో !
న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, ట్రుబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. బుధవారం ఢిల్లీ హైకోర్టు మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు బెయిల్ మంజూరు చెయ్యడంతో ఆయన విడుదల అవుతున్నారు. అయితే తీహార్ జైలులో ఉన్న డీకే. శివకుమార్ విడుదలకు బెయిల్ మంజూరు అయిన పత్రాలను ఆయన అనుచరులు తీహార్ జైలుకు తీసుకెలుతున్నారు.
అక్రమాస్తుల కేసు, మనీ ల్యాండరింగ్ కేసులో మాజీ మంత్రి డీకే. శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సెప్టెంబర్ 3వ తేదీన అరెస్టు చేశారు. సుమారు 50 రోజుల పాటు డీకే. శివకుమార్ తీహార్ జైలులో విచాణ ఖైదీగా శిక్ష అనుభవించారు.
అనారోగ్యంతో సతమతం అవుతున్న మాజీ మంత్రి డీకే. శివకుమార్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని బుధవారం ఆయన తరుపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, దయాన్ క్రిష్ణన్ ఢిల్లీ హైకోర్టులో మనవి చేశారు. డీకే. శివకుమార్ కు బెయిల్ మంజూరు చేస్తే ఆయన సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారుల తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు రూ. 25 లక్షల పూచికత్తుతో, ఇద్దరు షూరిటీతో డీకే. శివకుమార్ కు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించింది. ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరుకావాలని, పాస్ పోర్టు అధికారులకు అప్పగించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది. డీకే. శివకుమార్ కు బెయిల్ మంజూరు కావడంతో ఆయన అభిమానులు ఢిల్లీలో, బెంగళూరు, రామనగర్, కనకపురలో బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు.