మళ్లీ మొదటికి?: 2జీ కేసులో రాజా, కనిమొళికి హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: టెలికాం శాఖ మాజీ మంత్రి మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా 2జీ స్పెక్ట్రం కేసు నిందితులకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2జీ కుంభకోణం కేసులో 'సరైన ఆధారాలు' లేవంటూ కొద్ది నెలల క్రితం సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ఎ రాజా సహా ఈ కేసులోని కీలక నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఐ, ఈడీ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం నిందితులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి తీర్పును మే 25కు వాయిదా వేసింది.
ఈడీ జప్తు చేసిన ఆస్తులపై యథాతథ స్థితిని కొనసాగించాలని కూడా కోర్టు ఆదేశించింది. దీంతో జప్తు చేసిన ఆస్తులన్నీ ఈడీ స్వాధీనంలోనే ఉండనున్నాయి.
తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేయడంపై రాజా స్పందిస్తూ... 'తిరస్కారానికి గురైన వాళ్లు పై కోర్టులో అప్పీలు చేసుకోవడం చట్టబద్ధమైన హక్కు. ఒక వేళ నన్ను దోషిగా నిర్ధారిస్తే నేను కూడా అప్పీలు చేసుకుంటాను కదా? ఇందులో ప్రత్యేకత ఏముంది? ఇదంతా మామూలే. ఈ విషయం మాకు ముందే తెలుసు' అని చెప్పారు.