నేషనల్ హెరాల్డ్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేంద్రానికి షాక్
ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో పురోగతి కనిపించింది. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ అనుబంధంగా కొనసాగుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కార్యాలయాన్ని నవంబర్ 22లోగా ఖాళీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది నేషనల్ హెరాల్డ్. అయితే కేంద్రం తన ఆదేశాలపై స్టేటస్ క్యూ పాటించాలని ఆదేశించింది. అంటే యథాతథ స్థితి కొనసాగించాలని కేంద్రానికి చెప్పింది. దీంతో నేషనల్ హెరాల్డ్ యాజమాన్యానికి ఊరట లభించినట్లయ్యింది. ఇక కేసు మళ్లీ విచారణకు వచ్చేవరకు కోర్టు ఆదేశాలు పాటిస్తామని కేంద్రం తరపున వాదించిన సాల్సిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలిపారు.
నవంబర్ 22లోగా ఖాళీ చేయాలని నోటీసులు పంపిన కేంద్రం
56 ఏళ్లుగా ఉన్న లీజు అగ్రిమెంట్ ముగియడంతో అసోసియేటెడ్ జర్నల్స్ బిల్డింగ్ నవంబర్ 22లోగా ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అక్టోబర్ 30న నోటీసులు పంపింది. నోటీసులను సవాలు చేస్తూ సోమవారం నేషనల్ హెరాల్డ్ పత్రిక ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కార్యాలయం ఉన్న క్యాంపస్లో గత పదేళ్లుగా ఏ ఒక్క పత్రిక నడవడం లేదని ఆకార్యాలయంలో వాణిజ్య కార్యకలాపాలు నడుస్తున్నాయని నోటీసుల్లో పేర్కొంది. అయితే వీటిలో వాస్తవాలు లేవని ఏఎల్జే పిటిషన్లో దాఖలు చేసింది.
ఆర్థిక ఇబ్బందులతో మధ్యలో ప్రెస్ను మూసివేశాం
కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన కమిటీ సభ్యులు ప్రింటింగ్ ప్రెస్ గదులను చూడలేదని ఆ గదుల్లో ప్రింటింగ్ కావాల్సిన పరికరాలు, పేపర్ల స్టాక్ ఉందని ఏఎల్జే తెలిపింది. అంతేకాదు కొన్ని దశాబ్దాలుగా ఏఎల్జే పత్రికను ప్రచురిస్తోందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కొన్ని రోజుల పాటు పత్రిక ముద్రణ నిలిపివేసినట్లు చెప్పింది. తిరిగి న్యూస్ పేపర్తో పాటు డిజిటల్ మీడియా ఆపరేషన్స్ కూడా ఇదే బిల్డింగ్లో జరుగుతున్నాయని కోర్టుకు తెలిపింది. కేవలం రాజకీయ కోణంలోనే ప్రభుత్వం చూస్తోందని తెలిపింది.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నందునే నోటీసులు
కేవలం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నందునూ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించింది న్యూస్ హెరాల్డ్ సంస్థ. అంతేకాదు విపక్షాల గొంతును కూడా తమ పత్రిక ద్వారా వినిపిస్తున్నందున తమపై కేంద్రం కక్షగట్టిందని కోర్టుకు తెలిపింది. అంతేకాదు మే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేధింపులు ప్రారంభమయ్యాయని పేర్కొంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరును ఖ్యాతిని తుడిచివేసేందుకు కేంద్రం చేయని ప్రయత్నం అంటూ లేదని ఏఎల్జే తన పిటిషన్లో పేర్కొంది. కోర్టు ఇచ్చిన తీర్పు కేంద్రానికి మరో చెంపదెబ్బ అని ఏఎల్జే అభిప్రాయపడింది.