మోడీ మొదలెట్టేశాడు: కనిమొళితో ఆరంభం...ఏపీలో చంద్రబాబే లక్ష్యమా..?
2జీ స్పెక్ట్రం కేసులో టెలికాం శాఖ మాజీ కేంద్రమంత్రి రాజా, డీఎంకే ఎంపీ కనిమొళిలను వివరణ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఇప్పటికే వారిని నిర్దోషిగా విడుదలైన నేపథ్యంలో సీబీఐ ఢిల్లీ హైకోర్టులో వారి విడుదల సరికాదంటూ పిటిషన్ దాఖలు చేసింది.అయితే అంతకుముందు విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు కేసును అక్టోబరు 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే కేసు విచారణ త్వరతగతిన పూర్తి అయ్యేలా చూడాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వీరిద్దరికి నోటీసులు పంపింది ఢిల్లీ హైకోర్టు.
కనిమొళి, రాజాలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
సీబీఐ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో దీనిపై ఇంత త్వరగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ ఏకే చావ్లా ప్రశ్నించారు. ఈ కేసు దేశానికి సంబంధించిందని ఇందులో కొన్ని అంతర్జాతీయ లొసుగులు కూడా ఉన్నాయని అందుకే త్వరగా విచారణ చేయాలని కోరుతున్నట్లు ప్రభుత్వం తరపున న్యాయవాది రిపు దమన్ న్యాయమూర్తికి తెలిపారు. దీంతో 2జీ స్పెక్ట్రమ్ కేసులో ఉన్న అన్ని సంస్థలకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేస్తూ కేసు విచారణను జూలై 30కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే 2017లో రాజాకు, కనిమొళిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ విచారణ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.అయితే ఇది రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే జరుగుతోందని డీఎంకే ఆరోపిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు తమకు రాలేదని ఒక్కసారిగా మోడీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే నోటీసులు వచ్చాయని డీఎంకే ఆరోపిస్తోంది. అంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతోందని ధ్వజమెత్తింది.
టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ?
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కూడా ఇలానే ఉంది. మోడీ చంద్రబాబుపై సీబీఐని ఉసిగొల్పుతారా అనేది తెలుగు తమ్ముళ్లను వేధిస్తోంది. ఇప్పటికే చంద్రబాబుపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్ను విచారణ చేసేందుకు కోర్టు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆస్తులపై సీబీఐతో విచారణ చేయిస్తారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో సీబీఐను అడుగుపెట్టకుండా చేశారు. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని భావిస్తోంది. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేసే సీబీఐ దేశంలోని ఏరాష్ట్రంలో అయినా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఆయా కేసులకు సంబంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం సీబీఐని రాజకీయ కక్ష సాధించేందుకు వినియోగిస్తోందన్న ఆరోపణలతో గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం రావటంతో తిరిగి సీబీఐకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మోడీకి జగన్ సహకరిస్తున్నారా..?
ఇదిలా ఉంటే చంద్రబాబు హయాంలో కొన్ని రంగాల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. జగన్ వీటన్నిటిపై విచారణ చేయించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఇప్పుడు టీడీపీ వారిని కలవరపెడుతోంది. రాజధాని భూముల సేకరణలో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని వైసీపీ అప్పట్లో పత్రిపక్ష హోదాల ఆరోపణలు చేసింది.ఇప్పుడు దానిపై జగన్ విచారణ చేయిస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఇక కాంట్రాక్టులు కూడా టీడీపీ అస్మదీయులకే రావడాన్ని జగన్ తప్పుబట్టారు. ఈ పద్ధతిని కూడా మారుస్తామని చెప్పారు. ఇందులో చోటు చేసుకున్న అవినీతిపై కూడా సీబీఐతో విచారణ చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా జరిగితే చంద్రబాబు మంత్రి వర్గంలో పనిచేసిన పలువురు మంత్రుల పరిస్థితి పై టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇక మోడీతో జగన్ మంచి సంబంధాలు నెరుపుతున్న నేపథ్యంలో సీబీఐ దాడులు టీడీపీ వారిపై జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాట వినిపిస్తోంది.