కార్తీ చిదంబరంను అరెస్టు చెయ్యకూడదు, ఈడీకి హైకోర్టు ఆదేశం, సీబీఐ కస్టడీ, బీజేపీకి దెబ్బ !
Recommended Video
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్తీ చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలతో సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈడీ ఎంట్రీ
ఐఎన్ఎక్స్ మీడియా స్కాం కేసును సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విచారణ చేస్తోంది. అయితే ఈడీ తనను అరెస్ట్ చేయ్యకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కార్తి చిదంబరం ఢిల్లీ హైకోర్టుకు మనవి చేశారు.
హైకోర్టు ఆదేశం
కార్తీ చిదంబరం పిటిషన్ ను శుక్రవారం విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు ఈనెల 20వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చెయ్యకూడదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ కోర్టు కార్తీ చిదంబరంకు బెయిల్ మంజూరు చేస్తే ఈనెల 20వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చెయ్యరాదని, తరువాత తాము పరిశీలిస్తామని ఢిల్లీ హైకోర్టు చెప్పింది.
కార్తీ చిదంబరం సవాలు
మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన సమన్లను రద్దు చెయ్యాలని, తనపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని సవాలు చేస్తూ కార్తి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్పై స్పందించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఈడీకి శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
సీబీఐ కస్టడీ
కార్తీ చిదంబరం సీబీఐ కస్టడీ నేటితో (శుక్రవారం)ముగుస్తుండడంతో సీబీఐ అధికారులు మరో ఆరు రోజుల పొడిగింపు ఇవ్వాలని కోర్టులో మనవి చేశారు. కార్తీ చిదంబరం తన తండ్రి చిదంబరం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐఎన్ఎక్స్ మీడియా నుంచి భారీ మొత్తంలో ముడుపులు స్వీకరించారని సీబీఐ ఆరోపిస్తోంది.
రాజకీయ కక్షలు
రాజకీయ కక్షల కారణంగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంను వేధిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే సీబీఐ తనపని తాను చేసుకుపోతుందని, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదని బీజేపీ అంటోంది.