ఆస్పత్రి నిర్లక్ష్యం: 14రోజుల్లో 12మంది చిన్నారులు మృతి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆస్పత్రుల దుస్థితిని, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే మరో ఘటన దేశరాజధానిలో చోటు చేసుకుంది. ఢిల్లీలోని మహర్షి వాల్మీకి ఇన్ఫెక్షన్ వ్యాధుల నిరోధక ఆస్పత్రికి ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చిన్నారులను తీసుకొస్తుంటారు. అయితే, ఆ ఆసుపత్రిలో 14రోజుల్లో 12 మంది చిన్నారులు డిఫ్తీరియా ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు.
తగిన సమయంలో వాక్సినేషన్ వేయడం వల్ల ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయట పడవచ్చు. అయితే, వాల్మీకి ఇన్ఫెక్షన్ వ్యాధుల నిరోధక ఆస్పత్రిలో డిప్తీరియా వాక్సినేషన్ నిల్వలు లేవు. ఆ ఆసుపత్రిలో సుమారు 300 మంది డిఫ్తీరియా రోగులు ఉన్నారు.
సెప్టెంబరు 6 నుంచి సెప్టెంబరు 19 వరకు సరైన వైద్యం అందక 6 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న చిన్నారులు 12 మంది మృతి చెందినట్లు వెలుగులోకొచ్చింది. వర్షాకాలంలో చిన్నారులు చాలా మంది ఈ వ్యాధి బారిన పడి వస్తున్నారని, వారికి తగిన చికిత్స అందించడానికి కావాల్సిన మందులు తమ వద్ద అవసరానికి తగినంత లేవని ఆ ఆసుపత్రి వైద్యులు తెలపడం గమనార్హం.
చిన్నారులు డిఫ్తీరియా ఇన్ఫెక్షన్ బారిన పడితే వారి ప్రాణాలకే ముప్పు వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీ నుంచి తాము డిఫ్తీరియా మందులు కొనుగోలు చేస్తామని, కొంత కాలంగా అవి రావడం లేదని తెలిపారు. కాగా, ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పరిస్థితిని మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తున్నారు.