కదులుతున్న ఆటోలోని మహిళా జర్నలిస్టును లాగిపడేసిన దొంగలు: ఫోన్ కోసమేనా?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఫోన్ దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న ఆటోలో ఉన్న ఓ మహిళా జర్నలిస్టును కిందకి లాగిపడేశారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను అపహరించుకుని పారిపోయారు. ఆదివారం సాయంత్రం దక్షిణ ఢిల్లీలోని చిత్తరంజన్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దొంగల దాడిలో కిందపడిన సదరు మహిళా జర్నలిస్టుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ.. ఆటోలో వెళుతున్న మహిళా జర్నలిస్టు వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ను దొంగలించేందుకు యత్నించారు.
ఆమె నుంచి స్మార్ట్ ఫోన్ దొంగిలించే క్రమంలో ఆమెను కదులుతున్న ఆటో నుంచి లాగిపడేశారు దొంగలు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న ఫోన్ ను అపహరించుకుని పారిపోయారు. ఈ ఘటనలో జోమాల బాగ్చి అనే ఆ బాధిత మహిళా జర్నలిస్టు కాలు విరిగింది. దవడ, చేతికి గాయాలయ్యాయి.
ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోందుతోందని పోలీసులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. దొంగలు అపహరించుకుపోయిన ఫోన్ విలువ రూ. 18వేలేనని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, దొంగల కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.