'100'కి ఫోన్ చేస్తే స్పందన లేదు: హైకోర్టు జడ్జి ఆవేదన
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు జడ్జి విపిన్ సంఘీ పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ 100కు ఫోన్ చేస్తే సరైన స్పందన రాలేదు. దీంతో ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషన్ అలోక్ కుమార్ వర్మకు ఫోన్ ద్వారా చెప్పాలని చూశారు. అయితే ఆయన కూడా స్పందించలేదు.
దీంతో ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్తో పాటు ఢిల్లీ హైకోర్టుకు 'పూర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్' అంటూ ఓ లేఖ రూపంలో రాశారు. ఇప్పుడు ఆ లేఖను సుమోటోగా తీసుకున్న న్యాయస్థానం విచారణ చేపట్టింది. వివరాల్లోకి వెళితే ఢిల్లీ హైకోర్టు జడ్జి విపిన్ సంఘీ, ఏప్రిల్ 29న ఓ వివాహానికి వెళ్లేందుకు కారులో బయల్దేరారు.
వసంత్ కుంజ్ వద్దకు రాగానే విపరీతమైన ట్రాఫిక్ జాంలో ఆయన కారు చిక్కుకుపోయింది. ఈ సమయంలో ట్రాఫిక్ జాంను చక్కబెట్టడానికి ఎవరైనా ఉన్నారా అని చూస్తే చుట్టూ ఒక్క ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించలేదు.
దీంతో ఆయన ఈ ట్రాఫిక్ నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియక పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు గాను హెల్ప్ లైన్ నెంబర్ 100కు డయల్ చేశారు. ఫోన్ ఎవరూ తీయలేదు. దీంతో ఆయన ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్కు తెలియజేసేందుకు ఫోన్ చేయగా ఆయన ఫోన్ ఎత్తలేదు.
"నేను మీ ఫోన్ కు రాత్రి 10.27-10.30 గంటల సమయంలో పలుమార్లు కాల్ చేశాను. దురదృష్టవశాత్తూ నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు" అని కమిషనర్కు లేఖను రాస్తూ, దాని కాపీని హైకోర్టు చీఫ్ జస్టిస్ జి రోహిణికి పంపారు. న్యాయమూర్తి లేఖను సుమోటోగా తీసుకున్న రోహిణి కేసును విచారించాలని నిర్ణయించి నోటీసులు పంపారు.