ఢిల్లీ ఫలితాలు: షీలా దీక్షిత్పై కేజ్రీవాల్ ప్రతీకారం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రతీకారం తీర్చుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మొదటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో గణనీయమైన ఫలితాలు సాధించింది. షీలా దీక్షిత్ నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీ మూడో స్థానంలో నిలిచింది. బిజెపి ఆధిక్యతను ప్రదర్శించింది. బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.
అవినీతికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటడానికి పని చేసినట్లు భావిస్తున్నారు. అలాగే, నిర్భయ అత్యాచార సంఘటన కూడా ఆమ్ ఆద్మీకి ఉపయోగపడింది. నిర్భయ అత్యాచారం సంఘటన షీలా దీక్షిత్ ప్రభుత్వం ప్రతిష్టను గణనీయంగా తగ్గించింది. ఢిల్లీ యువత షీలా దీక్షిత్ వైఖరికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ వచ్చింది.
బిజెపి కూడా ఫలితాల పట్ల కాస్తా అసంతృప్తిగానే ఉంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని, చేస్తామని భావించిన బిజెపికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ వేసింది. నిత్యావసర సరుకుల ధరలే షీలా దీక్షిత్ కొంప ముంచాయని ఎఐసిసి అధికార ప్రతినిధి అభిషేక్ మనుసింఘ్వీ అన్నారు. కానీ, షీలా దీక్షిత్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడానికి ఎక్కవగా పనిచేసింది నిర్బయ అత్యాచార సంఘటనే.
షీలా దీక్షిత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నిరంతర పోరాటం సాగించింది. అవినీతి, మహిళలకు భద్రత అనే విషయంలో ఢిల్లీ ప్రజలు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే, ఢిల్లీలో ఈసారి పోలింగ్ శాతం కూడా పెరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు పెరగడం కారణంగానే పోలింగ్ శాతం పెరిగిందని భావిస్తున్నారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సాధించిన ఫలితాల పట్ల సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా ఆనందంగా ఉన్నారు. పార్టీ పెట్టడానికి వ్యతిరేకత ప్రదర్శించిన అన్నా హజారే కేజ్రీవాల్ చర్యను కూడా కొంత వ్యతిరేకించినట్లు కనిపించారు. ఈ ఫలితాలతో అన్నా హజారే వైఖరి రాజకీయాల విషయంలో మారవచ్చునని అంటున్నారు.