రూ.60కోట్ల మనీలాండరింగ్: లాయర్ టాండన్ అరెస్ట్
మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్ అరెస్టయ్యారు.
న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్ అరెస్టయ్యారు. భారీగా నల్లధనం కూడబెట్టిన ఆయనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దాదాపు రూ.60కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు టాండన్పై ఆరోపణలున్నాయి. అంతేగాక, గతంలో కోల్కతాలో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త పరాస్ మల్ లోధాతో టాండన్కు సంబంధాలన్నట్లు సమాచారం. అక్రమ మార్గాల్లో డబ్బు తరలించి అరెస్టైన ఢిల్లీలోని కొటాక్ బ్యాంక్ మేనేజర్ అశీష్ కుమార్తో కూడా ఇతనికి సంబంధాలున్నట్లే తేలింది.
డిసెంబర్ 10న టాండన్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు జరిపి రూ. 14కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.2.2కోట్ల విలువ చేసే 2వేల రూపాయల నోట్లు ఉండటం గమనార్హం. అతని వద్ద ఆదాయానికి మించి రూ.125కోట్లు ఎక్కువగా ఉన్నాయని ఐటీ దాడుల సందర్భంగా గుర్తించారు.
కాగా, తన ఇంట్లో దాడి జరుగుతున్న విషయాన్ని సీసీటీవీ కెమెరాల సాయంతో తన మొబైల్ ఫోన్లో చూసి అధికారులకు దొరక్కుండా అక్కడ్నుంచి పరారయ్యారు. దాదాపు 10రోజుల తర్వాత అధికారులు టాండన్ ను పట్టుకున్నారు. అతడ్ని కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.
టాండన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే గానీ.. అక్రమాలన్నీ వెలుగుచూస్తాయని చెబుతున్నారు. కాగా, రూ. 145కోట్ల అక్రమాస్తులను కలిగివున్న శేఖర్ రెడ్డిని ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టాండన్, శేఖర్ రెడ్డిని ఈడీ, ఐటీ శాఖ, సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.