13 రోజుల తర్వాత విధుల్లోకి.. హైకోర్టు ఆదేశాలతో... భద్రతపై ఉద్యమిస్తాం: లాయర్లు
తమతో పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఢిల్లీ తీస్ హజారీ కోర్టు న్యాయవాదులు చేపట్టిన ఆందోళన ముగిసింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో లాయర్లు దిగొచ్చారు. తమ నిరసనకు మంగళం పాడుతున్నట్టు ప్రకటించారు. శనివారం నుంచి విధుల్లో పాల్గొంటామని స్పష్టంచేశారు.
ఘర్షణ
ఢిల్లీ తీస్ హజారీ కోర్టులో ఈ నెల 2వ తేదీన పోలీసులతో లాయర్లకు ఘర్షణ జరిగింది. పోలీసుల తీరును తప్పుపడుతూ లాయర్లు ఆందోళన బాటపట్టారు. ఘటనపై హైకోర్టు స్పందించింది. 2వ తేదీన జరిగిన ఘటనకు సంబంధించి కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం, బార్ అసోసియేషన్లకు నోటీసులు జారీచేసింది.
ఆందోళనబాట
దీంతో గత 13 రోజులుగా లాయర్లు ఆందోళన చేయడంతో ఎక్కడి కేసులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. న్యాయవాదుల ఆందోళన హైకోర్టు స్పందించింది. నిరసన విరమించి, కోర్టుకెళ్లాలని సూచించింది. హైకోర్టు సూచనతో తమ ఆందోళనకు పుల్ స్టాప్ పెడుతున్నట్టు న్యాయవాదులు పేర్కొన్నారు. కానీ అడ్వకేట్ల రక్షణకు సంబంధించి తమ ఆందోళన కొనసాగుతుందని జిల్లా కోర్టు కో ఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ధిర్ సింగ్ పేర్కొన్నారు.
ఇదీ విషయం
తీస్ హజారీ కోర్టు వద్ద గల పార్కింగ్ విషయంలో పోలీసులు, లాయర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. తమ ముందు కొందరు పోలీసులు లాయర్ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారని.. దాడి చేశారని అడ్వకేట్లు పేర్కొన్నారు. వెంటనే తాము కలుగజేసుకున్నామని వివరించారు. అలా అలా.. వారి మధ్య మాటల నుంచి చేతల వరకు వెళ్లింది.
పోలీసు జీపు ధ్వంసం
దీంతో అడ్వకేట్లు రెచ్చిపోయారు లాయర్ను ఢీ కొన్న పోలీసు జీపును తగలబెట్టే వరకు పరిస్థితి వెళ్లింది. తమపై దాడి ఘటనను పోలీసు ఉన్నతాధికారులు, జడ్జీ దృష్టికి తీసుకెళ్లామని లాయర్లు చెప్తున్నారు. కోర్టు వద్ద పరిస్థితి చేయిదాటడంతో అదనపు బలగాలను మొహరించారు. ఆ మరుసటి రోజు నుంచి లాయర్లు ఆందోళన చేస్తున్నారు.