ఫలిస్తోన్న లాక్డౌన్ వ్యూహం: కరోనా పాజిటివిటీలో 12% క్షీణత: 17 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి లాక్డౌన్ను పొడిగించింది అక్కడి ప్రభుత్వం. లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం ఇది నాలుగోసారి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి మరోసారి వారం రోజుల పాటు లాక్డౌన్ను విధించింది. ఈ నెల 17వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ను అమలు చేస్తోన్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీలో కరోనా వైరస్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. ఇదివరకటితో పోల్చుకుంటే- పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ఇంతకుముందు 35 శాతం మేర రికార్డవుతూ వచ్చిన రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ రేటు.. 23 శాతానికి తగ్గింది. రెండు, మూడు రోజుల్లో ఈ సంఖ్య 23 శాతానికి పరిమితమైంది. దాన్ని దాటట్లేదు. ఈ రేటును మరింత తగ్గించడానికి మరో వారం రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించినట్లు కేజ్రీవాల్ వెల్లడించారు.
ఇదివరకు తొలిసారిగా కిందటి నెల 19వ తేదీన ఢిల్లీలో పూర్తిస్థాయి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. 10 గంటల నుంచి 26వ తేదీ తెల్లవారు జామున 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉండేలా తొలి లాక్డౌన్ను విధించారు. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యలో ఏ మాత్రం తగ్గుదల కనిపించకపోవడంతో దాన్ని మరో వారం రోజుల పాటు పొడిగించారు. అయినప్పటికీ- పరిస్థితుల్లో మార్పు కనిపించలేదు. మళ్లీ 10వ తేదీ వరకు ఎక్స్టెండ్ చేశారు. మూడోసారి పొడిగించిన లాక్డౌన్ సత్ఫలితాలను ఇస్తోంది.
Recommended Video
రోజువారీ కరోనా వైరస్ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. మూడు రోజులుగా వరుసగా పరిమితంగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 35 శాతం నుంచి 23 శాతానికి తగ్గింది. 12 శాతం మేర క్షీణత కనిపించింది. లాక్డౌన్ను పొడిగించడం వల్ల మరింత తగ్గుదల కనిపిస్తుందనే ఉద్దేశంతో నాలుగోసారి లాక్డౌన్ పొడిగించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఈ సారి లాక్డౌన్లో మెట్రో రైళ్లు కూడా అందుబాటులో ఉండబోవని స్పష్టం చేశారు. సోమవారం నుంచి మెట్రో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు.