కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై మిగతా రాష్ట్రాలు ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. కరోనా పరీక్షలను తప్పనిసరి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి కేజ్రివాల్ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎల్లుండి నుంచి మార్చి 15 వరకూ ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇలా కరోనా పరీక్షలు తప్పనిసరి చేసిన రాష్ట్రాల ప్రయాణికుల్లో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్ఘడ్ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది.
ఈ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా వైరస్ నెగెటివ్ రిపోర్టు తీసుకొస్తేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ నమోదైన 6.38 లక్షల పాజిటివ్ కేసుల్లో 6.26 లక్షల మంది కోలుకున్నారు. 10903 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 639 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.