సెకెండ్ హ్యాండ్ బైక్ రేటు రూ.15 వేలు..చలాన్ 11 వేలు: లైటర్ తో బైక్ నిప్పంటించేశాడు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన ట్రాఫిక్ చలాన్ల వ్యవహారం నానాటికీ ముదురుతోంది. కొద్దిరోజుల కిందటే ఓ స్కూటీకి 23 వేల రూపాయల చలాన్ వేయడంతో.. దాన్ని సెకెండ్ హ్యాండ్ కు అమ్మినా అంత రేటు రాదంటూ అక్కడే వదిలేసి వెళ్లాడో వ్యక్తి. ఒడిశాలో ఓ సాధారణ ఆటోకు 45 వేల రూపాయలకు పైగా చలాన్ వేశారు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు. తాజాగా- ఓ వ్యక్తి కొత్తగా కొన్న సెకెండ్ హ్యాండ్ బైక్ కు 11 వేల రూపాయల ఫైన్ వేశారు. కొన్న ధరకు సమానంగా చలాన్ వేశారనే ఆగ్రహానికి గురయ్యాడా బైకర్. అప్పటికప్పుడు, అక్కడికక్కడ నడిరోడ్డుపై బైక్ ను తగులబెట్టేశాడు. దేశ రాజధానిలోని షేక్ సరాయ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రితో వైసీపీ ఎమ్మెల్యే భేటీ
ఢిల్లీకి చెందిన రాకేష్ అనే వ్యక్తి కొత్తగా బజాజ్ పల్సర్ బైక్ ను 15000 రూాయలకు సెకెండ్ హ్యాండ్ లో కొనుగోలు చేశాడు. గురువారం సాయంత్రం షేక్ సరాయ్ ప్రాంతంలో వెళ్తుండగా..చిరాగ్ ఢిల్లీ సమీపంలోని త్రివేణి కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా.. నిర్దేశిత ప్రమాణాల కంటే అధికంగా మద్యాన్ని సేవించినట్లు తేలింది. పాత చలాన్ల ప్రకారం.. మద్యం సేవించి ద్విచక్ర వాహనాన్ని నడిపితే 1000 రూపాయల జరిమానా ఉండేది. కొత్తగా అమలులోకి తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం.. మద్యం సేవించి బైక్ ను నడిపితే 10 వేల రూపాయల జరిమానా విధించారు. మరో 1000 రూపాయలను దీనికి అదనంగా జోడించారు.
11000 రూపాయల జరిమానా చెల్లించిన తరువాత బైక్ ను ఇస్తామని ట్రాఫిక్ కానిస్టేబుళ్లు స్పష్టం చేయడంతో ఆగ్రహానికి గురయ్యాడు. అసలే మద్యం మత్తులో ఉన్న రాకేష్.. బజాజ్ పల్సర్ బైక్ పెట్రోల్ పైప్ ను వెలికి తీసి సిగరెట్ లైటర్ తో అంటించేశాడు. క్షణాల్లో భగ్గుమందా బైక్. మంటల్లో మాడి మసి అయింది. సమీపంలోని త్రివేణి కాంప్లెక్స్ నుంచి మంటలను ఆర్పే పరికరాలను అగ్నికీలలను అదుపు చేసే లోపే మొత్తం కాలిపోయింది.
బైక్ కు మంటలు అంటించిన వెంటనే రాకేష్ అక్కడి నుంచి మాయం అయ్యాడు. బైక్ పేపర్ల ఆధారంగా పోలీసులు సుమారు రెండు గంటల తరువాత అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు. తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరైన సందర్భంగా మద్యాన్ని సేవించినట్లు రాకేష్ అంగీకరించాడని ఢిల్లీ అదనపు డీసీపీ (దక్షిణ) పర్వీందర్ సింగ్ తెలిపారు.