ఢిల్లీలో విషాదం: మెట్రో రైలు ముందర దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి
ఢిల్లీ: ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. మానసిక పరిస్థితి బాగోలేక గత రెండేళ్లుగా చికిత్స పొందుతున్న 23 ఏళ్ల వ్యక్తి ఒకరు ఢిల్లీ మెట్రో రైలు వస్తుండగా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నితిన్ అనే వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు తెలిపారు. ఇక కదులుతున్న రైలు ముందు దూకడంతో నితిన్ శరీరం రెండు ముక్కలుగా తెగిపడిపోయింది. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో చోటుచేసుకుందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు తెలిపారు.
ఇక ఈ ఘటన నిత్యం రద్దీగా ఉండే పసుపుపచ్చ లైన్లో జరిగిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన జరగడంతో 15 నుంచి 20 నిమిషాలపాటు రైళ్ల సేవలు నిలిపివేయడం జరిగిందని అధికారులు వెల్లడించారు. హుడా సిటీ సెంటర్ వైపునకు రైలు వెళ్లాల్సి ఉంది. సివిల్ లైన్స్ స్టేషన్కు సమీపిస్తుండగా నితిన్ ఒక్కసారిగా ప్లాట్ఫాంపై నుంచి రైలుకు ఎదురుగా దూకాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దూకడంతో రైలు నితిన్ పై నుంచి పోవడంతో ఆయన శరీరం రెండు భాగాలుగా విడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం చేరవేసినట్లు చెప్పారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టాల మధ్యలో ఇరుకున్న నితిన్ మృతదేహాన్ని వెలికి తీశారు. సబ్జీ మండి ప్రాంతంలోని ఓ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. ఢిల్లీలోని జగత్పూర్ నివాసినగా నితిన్ను పోలీసులు గుర్తించారు. గత రెండేళ్లుగా మానసిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఓ హాస్పిటల్లో నితిన్ చికిత్స పొందుతున్నాడని మృతుడి తండ్రి తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడటం ఇది తొలిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో 60 ఏళ్ల వృద్ధుడు కదులుతున్న మెట్రో రైలు ముందు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తిలక్ నగర్ మెట్రో స్టేషన్లో జరిగింది. ప్రయాణికులు ప్లాట్ ఫాంపై ఉన్న సమయంలో వారికి కేటాయించిన స్థలంలోనే నిలబడేలా పోలీసులు చూడాలని కొందరు ప్రయాణికులు కోరుతున్నారు. అయితే అందరినీ మానిటర్ చేసేందుకు సిబ్బంది సంఖ్యను పెంచితే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.