క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక భార్యా, బిడ్డతో కలిసి ఏం చేశాడంటే..?
ఢిల్లీ : ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. బిల్డింగ్ నాల్గో ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు యత్నించారు. ఈ ఘటనలో భర్త చనిపోగా.. భార్య, నాలుగేళ్ల కూతురు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించలేక
ఈస్ట్ ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి జగత్పురి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. గురుగ్రామ్లోని ఓ సంస్థలో పనిచేస్తున్నాడు. భార్య గృహిణి కాగా.. నాలుగేళ్ల కూతురు చదువుకుంటోంది. అవసరాల నిమిత్తం సదరు వ్యక్తి వివిధ బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు తీసుకున్నాడు. అలా దాదాపు రూ.8లక్షల వరకు బాకీ పడ్డాడు. దీంతో బ్యాంకులకు చెందిన వ్యక్తులు రికవరీ కోసం తరుచూ ఫోన్, మెసేజ్లు చేస్తుండటంతో ఆందోళనకు గురయ్యాడు. అప్పు తిరిగి ఎలా చెల్లించాలో తెలియక మధనపడ్డాడు. బంధువులు, స్నేహితులు సాయం అందించకపోవడంతో చివరకు కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
భార్య, కూతురితో కలిసి ఆత్మహత్యయత్నం
సోమవారం తెల్లవారుజామున 3.30గంటల సమయంలో భార్య, భర్త కూతురితో కలిసి ఆత్మహత్యకు సిద్ధమయ్యారు. నిద్రపోతున్న పాపను ఎత్తుకుని బిల్డింగ్ టెర్రస్ పైకి ఎక్కారు. భర్త బిడ్డను భుజాలపై ఎత్తుకుని నాల్గో ఫ్లోర్ నుంచి దూకేశారు. భారీ శబ్దం రావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు చుట్టు పక్కల వారు బయటకు వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి షాకయ్యారు. పోలీసులకు సమాచారం అందించారు.
చిన్న గాయాలతో బయటపడిన చిన్నారి
ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారిలో భర్త స్పాట్లోనే చనిపోయాడు. భార్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇక నాలుగేళ్ల కూతురు కిందకు దూకిన సమయంలో అక్కడ పార్క్ చేసిన స్కూటర్ సీటుపై పడటంతో చిన్న గాయాలతో బయటపడింది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.