సర్ ప్రైజ్.. కళ్లుమూసుకో అన్నాడు.. పాపం ఆమె మూసింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
తన భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తే.. భార్యను పార్కుకు రమ్మని పిలిచి గొంతు చుట్టూ వైరు బిగించి అంతమొందించాడు.
న్యూఢిల్లీ: వారిద్దరూ భార్యాభర్తలు.. అప్పటికే గొడవలున్నాయి.. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఉన్నట్లుండి ఒకరోజు భర్త ఎక్కడలేని ప్రేమ ఒలకబోశాడు. అన్ని గొడవలు మర్చిపోయి కలిసుందాం అన్నాడు. ఆమె నమ్మింది. పార్కుకు రమ్మంటే వెళ్లింది.
సర్ ప్రైజ్.. కళ్లుమూసుకో అన్నాడు భర్త. దీంతో తనకే నెక్లెస్సో ఇవ్వబోతున్నాడో అనుకుని భార్య వెంటనే కళ్లమూసుకుంది. అంతే- అతడిలో రాక్షసుడు మేల్కొన్నాడు. వెంటనే ఓ వైరు తీసుకుని ఆమె మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు.
ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని బోంటా పార్క్ లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని మనోజ్ కుమార్ అనే వ్యక్తి కోమల్ అనే యువతిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయ్యాక ఇద్దరి నడుమ విభేదాలు పొడచూపాయి.
తన భార్య కోమల్ కు వివాహేతర సంబంధం ఉందని మనోజ్ కుమార్ అనుమానం. ఈ విషయంలోనే వారిరువురి నడుమ తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఇద్దరూ కొంత కాలంగా విడివిడిగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో కోమల్ ను అంతమొందించాలని మనోజ్ కుమార్ నిశ్చయించుకున్నాడు. ఆమెను ఒంటరిగా బయటికి రప్పించడం కోసం ఫోన్ చేసి ప్రేమగా మాట్లాడాడు. ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు ఫుల్ స్టాప్ పెడదామన్నాడు. ఒక్కదానినే ఉత్తర ఢిల్లీలోని బోంటా పార్క్ వద్దకు రమ్మన్నాడు. పాపం.. కోమల్ భర్త మాటలు విని, నమ్మింది. అతడు మారిపోయాడనుకుంది.
శుక్రవారం సాయంత్రం కోమల్ ఒంటరిగా బోంటా పార్క్ కు వచ్చింది. అసలే ఆ పార్క్ చిన్న సైజు అడవిలాగుంటుంది. మనోజ్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నాడు. వచ్చేటప్పుడే కంజ్ వాలాలో ఒక వైరు కొని జేబులో పెట్టుకుని వచ్చాడు. వచ్చీ రాగానే ప్రేమగా పిలిచి అప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు. ఎవరూ లేని చోటికి తీసుకెళ్లి కాసేపు ఆ కబురూ ఈ కబురూ చెప్పుకున్నాక.. సర్ ప్రైజ్, కళ్లుమూసుకో అన్నాడు.
భర్త తనకేదో బహుమతి తెచ్చాడని, అది ఇవ్వబోతున్నాడన్న ఆనందంతో కోమల్ కళ్లుమూసుకుంది. వెంటనే జేబులోంచి వైరు తీసిన మనోజ్ కుమార్ భార్య మెడచుట్టూ గట్టిగా బిగించాడు. ఆమె ఊపిరాడక గిలగిలా కొట్టుకుని చనిపోయింది. ఆమె మృతదేహాన్ని అక్కడే వదిలేసి మనోజ్ కుమార్ అక్కడ్నించి జారుకున్నాడు.
భార్యను వదిలించుకున్నాననే ఆనందంతో మనోజ్ కుమార్ తన స్నేహితులను కలిసి మద్యం సేవిస్తూ జరిగినదంతా వారికి వివరిస్తున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన పెట్రోలింగ్ పోలీసులకు అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి ప్రశ్నించడంతో మొత్తం కథంతా బయటపడింది.
దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని కోమల్ మృతదేహాన్ని గుర్తించేందుకు బోంటా పార్క్ కు తీసుకెళ్లారు. అడవిలా ఉండే ఆ పార్క్ లో తామెక్కడ కలుసుకున్నారో ఆ ప్రదేశాన్ని మనోజ్ కుమార్ గుర్తించలేకపోవడంతో పోలీసులు దాదాపు 6 గంటల పాటు గాలించి చివరికి కోమల్ మృతదేహాన్ని గుర్తించారు. మనోజ్ కుమార్ పై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.