కరోనావైరస్తో ఆందోళన అక్కర్లేదు..నాకు నయమైంది: చికిత్స అనంతరం ఢిల్లీ బాధితుడు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనావైరస్ బారిన పడిన తొలి వ్యక్తి కోలుకున్నాడు. కరోనావైరస్కు సంబంధించి ఎలాంటి ఆందోళన లేదా కంగారు పడాల్సిన అవసరం లేదన్నాడు. పారిశ్రామికవేత్త అయిన ఈ వ్యక్తి రెండువారాలుగా ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్లో చికిత్స పొందాడు. ఇది సాధారణ ఫ్లూ లాంటిదని చెప్పిన బాధితుడు అసలు భయపడాల్సిన పనే లేదని చెప్పాడు. ఐసొలేషన్ వార్డులో ఒంటరిగా ఉండటమంటే కనీసం వెంటిలేషన్ కూడా ఉండకుండా ఉండటం కాదని సఫ్ధార్ జంగ్ హాస్పిటల్లో అన్ని సదుపాయాలు సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడు.
ఇక కరోనావైరస్ లక్షణాలు కనిపించగానే రెండు వారాల పాటు చికిత్స తీసుకున్న ఈ వ్యక్తి ఆదివారం రోజున డిశ్చార్జ్ అయ్యాడు. సఫ్ధార్జంగ్ హాస్పిటల్లో వైద్యులు కూడా బాగా చూసుకోవడంతోపాటు మంచి చికిత్సను అందించారని తన అనుభవాన్ని పంచుకున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన తాను యూరప్ దేశం నుంచి భారత్కు చేరుకున్నట్లు చెప్పిన బాధితుడు... తనకు జ్వరం వచ్చిందని చెప్పాడు.
వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లగా గొంతు ఇన్ఫెక్షన్తోనే జ్వరం వచ్చిందని చెప్పారు. మూడురోజులకు మెడిసిన్స్ ఇచ్చారనిచెప్పిన బాధితుడు ఫిబ్రవరి 28వ తేదీన కోలుకున్నట్లు చెప్పాడు. మళ్లీ ఫిబ్రవరి 29వ తేదీన జ్వరం తిరగబెట్టడంతో రామ్మనోహర్ లోహియా హాస్పిటల్కు వెళ్లగా మార్చి 1వ తేదీన తనకు కరోనావైరస్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు చెప్పాడు.
తనకు కరోనావైరస్ సోకిందని వైద్యులు చెప్పనంతవరకు ఏమైందో అన్న భయంతో తాను ఉన్నట్లు బాధితుడు చెప్పాడు. అయితే కరోనావైరస్ సోకిందని చెప్పి తనను పరీక్షించేందుకు కొందరు వైద్యులు వచ్చారని చెప్పాడు. అయితే కరోనావైరస్ కచ్చితంగా తగ్గుతుందని దీనిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు చెప్పడంతో తాను భయాన్ని వీడినట్లు చెప్పాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్పిన వైద్యులు కేవలం దగ్గు జలుబు మాత్రమే ఉందని చెబుతూ తనకు స్వాంతన చేకూర్చే మాటలు చెప్పినట్లు బాధితుడు చెప్పాడు. సాధారణంగా వచ్చే జలుబు దగ్గుల కంటే నయం అయ్యేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్పినట్లు బాధితుడు చెప్పాడు.
Recommended Video
ఇక సఫ్దార్జంగ్ హాస్పిటల్లో చేరినట్లు చెప్పిన బాధితుడు అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పారు. ఒక అటాచ్ బాత్రూం ఉన్న ప్రత్యేక గది తనకు కేటాయించారని చెబుతూ ప్రైవేట్ హాస్పిటల్ కంటే సదుపాయాలు బాగున్నాయని వెల్లడించాడు. ఇదిలా ఉంటే ఢిల్లీ నుంచి రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడగా... ఒక వ్యక్తి మృతి చెందాడు. రెండో వ్యక్తి కోలుకున్నాడు. ఇదిలా ఉంటే ఆదివారం నాటికి దేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 110కి చేరుకుందని ఆరోగ్యశాఖ వెల్లడించింది.