గర్ల్ఫ్రెండ్ గిఫ్ట్ కోసం.. డెలీవరీ బాయ్పైనే దాడికి దిగి... హస్తినలో కలకలం
పండగో, పబ్బం వస్తే గర్ల్ఫ్రెండ్ ఆకట్టుకోవడం సహజం. ఏదైనా ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి మనసు గెలచుకోవడం సాధారణమే. అందుకోసం కొందరు భారీగా డబ్బులు ఖర్చుపెడతారు. మరికొందరు నిరీక్షించి కొనుగోలు చేస్తారు. కానీ ఢిల్లీలో ముగ్గురు యువకులు మాత్రం వేరే పంథా అనుసరించారు. ఖరీదైన వస్తువులను కొట్టేసీ.. గిఫ్ట్ ఇద్దామనుకొని బొక్కబొర్లపడ్డారు. ఖాకీలకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు.
స్కెచ్ వేసి
ఢిల్లీకి చెందిన శశాంక్ అగర్వాల్, అమర్ సింగ్, విశాల్ స్నేహితులు. వీరు ముగ్గురు ఇదివరకు ఆన్లైన్ పోర్టల్లో పనిచేశారు. ఎక్కడ కుదురుగా ఉండకపోవడంతో జాబ్ మానేశారు. ఇంకేముంది హవారాగా తిరగడం, గడిపేయడమే హాబీగా మారింది. అయితే వీరికి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అదే వీరిని కటకటాల్లోకి నెట్టింది. లవ్లో ఉంటే గిప్ట్లు కొనివ్వడం సాధారణమే కదా.. అలా అని వారికి బహుమతి ఇద్దామనుకొన్నారు. అయితే ఏం పని లేదు, చేతిలో చిల్లిగవ్వ లేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ముగ్గురు పకడ్బందీగా ఆలోచన చేశారు.
పండగనే ఆసరాగా చేసుకొని
దీపావళి పండగ వస్తోంది. దివాళి అంటే ఉత్తర భారతదేశంలో చాలా పెద్ద పండగ. దివాళి సందర్భంగా కొత్త వస్తువులను కొనుగోలు చేయడం సాధారణం. ఇక ఆన్లైన్ పోర్టల్స్ అయితే ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తాయి. దీంతో చాలామంది కొనుగోలు చేస్తారు. అలానే కొందరు తమ వస్తువులను ఆర్డర్ చేశారు. కానీ వారికి తెలియలేదు ఆ ముగ్గురు నక్కలా కాచి ఉండి దోచుకుంటారని.. కానీ తర్వాత వీరి ఆచూకీ కనుక్కొని ఇద్దరిని కూడా పట్టుకున్నారు.
డెలివరీ బాయ్ నుంచి
దివాళి పండగ సందర్భంగా డెలివరీ బాయ్ విలువైన వస్తువులను తీసుకొచ్చాడు. గురువారం పంజాబీ బాగ్ వద్దకొచ్చాడు. కానీ అప్పటికే కాచుకొని కూర్చొన్న శశాంక్ టీం.. అతనిపై దాడి చేసింది. అతని వద్ద ఉన్న విలువైన వస్తువులను తీసుకొని పరారయ్యారు. అందులో ఐ ఫోన్ 11 సహా, ఖరీదైన వస్తువులు ఉన్నాయి. వాటిని తీసుకెళ్లి లవర్కు ఇచ్చి ఇంప్రెస్ చేద్దామనుకొన్నారు. కానీ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యారు.
అదుపులో నిందితులు
డెలివరీ బాయ్ ఫిర్యాదు మేరకు శశాంక్, అమర్ సింగ్ ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. తమ గర్ల్ ఫ్రెండ్కు విలువైన వస్తువులు ఇచ్చేందుకు దొంగతనం చేశారని పోలీసులు తెలిపారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. మూడో వ్యక్తి విశాల్ పరారీలో ఉన్నాడని.. అతనిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.