ముఖాల మీద ముసుగులు వేయొద్దు: ఢిల్లీ మెట్రో
న్యూఢిల్లీ: ఇక నుంచి ఢిల్లీ మెట్రో స్టేషన్లలో కొత్త నిబంధన అమలులోకి రానుంది. అదేంటంటే.. ముఖానికి ముసుగులు ధరించిన వారిని ఎవ్వరినీ ఆ స్టేషన్లలోకి అనుమతించబోరు. భద్రతా పరమైన కారణాలతోనే దాదాపు 24 స్టేషన్లలో ఈ కొత్త నిబంధన అమల్లోకి రానుంది. దీంతో ముఖానికి మాస్కులు ధరించినా, మఫ్లర్లు, జేబురుమాళ్లు కట్టుకున్నా సరే.. వారిని స్టేషన్లలోకి అనుమతించరు.
ఢిల్లీలోని రాజీందర్ ప్రాంతంలోని మెట్రో స్టేషన్లో సోమవారం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కంట్రోల్ రూంలోకి చొరబడి రూ.12లక్షల నగదును దోపిడీ చేశారు. వారిద్దరూ ముఖానికి మాస్కులు ధరించి ఉన్నట్లు సీసీటీవీలో రికార్డయ్యింది.
దీంతో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) మెట్రో స్టేషన్లలో ప్రవేశానికి కొత్త నిబంధనల్ని రూపొందించింది. ముఖానికి ఏ విధమైన గుడ్డకాని, మాస్కులు, మఫ్లర్లు, దుపట్టా, యాంటి పొల్యుషన్ క్యాప్ తదితరాలు ఏమి ధరించినా లోపలికి రానివ్వకూడదని నిర్ణయించింది.
కేవలం తీవ్ర అనారోగ్యంతో ఉన్న పేషెంట్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. వేడి నుంచి తప్పించుకునేందుకు, కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు ఇక ఎవరూ తమ ముఖాలపై ముసుగు వేసుకోకూడదని మెట్రో అధికారులు స్పష్టం చేశారు.
ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితుల్ని గుర్తు పట్టేందుకు వీలుగా ఈ నిబంధనను తీసుకొస్తున్నట్లు తెలిపారు. మెటల్ డిటెక్టర్లు, బ్యాగుల్ని చెక్ చేసేందుకు ఎక్స్రే మిషన్లను మెట్రో స్టేషన్ ప్రవేశ ద్వారాల వద్ద ఉంచనున్నామని వివరించారు.
కాగా, ఢిల్లీ మెట్రో ద్వారా దాదాపు 26లక్షల మంది తమ గమ్య స్థానాలు చేరుకుంటుండగా, 5వేల మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది భద్రతా చర్యలను చేపడుతున్నారు. ఢిల్లీతోపాటు ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గుర్వావ్లలో వీరే భద్రతను పర్యవేక్షిస్తున్నారు.