మెట్రో అంచనాలు తారుమారు: ఛార్జీల పెంపుతో 'లక్షల' షాక్
ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఢిల్లీ మెట్రోకు నిరాశ ఎదురైంది. అక్టోబరులో ప్రయాణ ఛార్జీలను పెంచింది. ఆ మరుసటి రోజు నుంచే రోజుకు సగటున 3 లక్షల మంది ప్రయాణీకులు మెట్రో ఎక్కడం మానేశారు.
ఢిల్లీ: ఆదాయాన్ని పెంచుకోవాలన్న ఢిల్లీ మెట్రోకు నిరాశ ఎదురైంది. అక్టోబరులో ప్రయాణ ఛార్జీలను పెంచింది. ఆ మరుసటి రోజు నుంచే రోజుకు సగటున 3 లక్షల మంది ప్రయాణీకులు మెట్రో ఎక్కడం మానేశారు.
మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గింది
సెప్టెంబరులో రోజుకు సగటున 27.4 లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. అక్టోబరులో ధరలు పెరిగిన తర్వాత ఈ సంఖ్య 24.2కు పడిపోయింది. అంటే సుమారు 11 శాతం మంది మెట్రో రైళ్లను వినియోగించడం లేదు.
పెంపును కేజ్రీవాల్ తప్పుబట్టారు
సమాచార హక్కు దరఖాస్తుకు బదులుగా ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ ఈ సమాచారం ఇచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ఛార్జీల పెంపును గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించారు.
కనీస ఛార్జీ
2002లో ఢిల్లీలో మెట్రో ప్రారంభమైన సమయంలో కనీస ఛార్జీ రూ.4, గరిష్ట ఛార్జీ రూ.8గా ఉండేది. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10. మాగ్జిమమ్ ఛార్జీ రూ.60 వరకు పెంచారు. దీంతో తీవ్ర భారంగా భావిస్తున్న ప్రజలు ఎక్కేందుకు ఆసక్తి చూపడం లేదు.
వాహనాలు వదిలి రైళ్లలో
ఢిల్లీలో 213 కి.మీల మేర ఉన్న ఈ మెట్రో రైలులో రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. మెట్రో రాకతో అనేకమంది తమ ప్రయివేటు వాహనాలను వదిలి రైళ్లలోనే ప్రయాణిస్తున్నట్టు సర్వేలో వెల్లడయింది.
మళ్లీ వాహనాలను ఆశ్రయించే అవకాశం
కానీ తాజాగా ఛార్జీలు పెంచడంతో ప్రయివేటు వాహనాలను ఆశ్రయించే అవకాశముందని రవాణారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగ్గట్లే లక్షల మంది మెట్రో రైలు ఎక్కడం లేదని తేలింది.