ఢిల్లీ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు 5వేల ఐడియాలు..
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం ఎంతగా పట్టి పీడిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అసలే కాలుష్య నగరం.. దానికి దీపావళి కాలుష్యం తోడవడంతో వాతావరణంలో కాలుష్య స్థాయి గణనీయంగా పెరిగిపోయింది. గత 17ఏళ్లలో గరిష్ట స్థాయి కాలుష్యాన్ని ఢిల్లీ ప్రజలు ఇప్పుడు అనుభవించక తప్పట్లేదు.
కాలుష్యం బారిన పడ్డ ప్రజలంతా అనారోగ్యం పాలయ్యే అవకాశమున్నా.. ఎలాంటి నివారణ చర్యలను అనుసరించాలనే దానిపై స్పష్టత లేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ టూరిజం మినిస్టర్ కపిల్ మిశ్రా ఆన్ లైన్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా కోరాడు. అనూహ్యంగా గంట వ్యవధిలోనే దాదాపు 5వేల సలహాలు, సూచనలు అందాయట.
కాలుష్య సంక్షోభాన్ని అధిగమించేందుకు గాను ప్రతీ ఢిల్లీ వాసి ఒక 2నిముషాలు సమయం కేటాయించి సలహాలు ఇవ్వాల్సిందిగా మిశ్రా కోరారు. దీంతో పెద్ద ఎత్తున సలహాలు సూచనలు వచ్చి చేరాయి. మరి వీటిల్లో ప్రభుత్వ ఆచరణకు పనికి వచ్చేవెన్నో.. పనికిరానివెన్నో..! దేన్ని ఆచరణలో పెట్టి కాలుష్య నియంత్రణ చేస్తారో వేచి చూడాలి.