ఢిల్లీలో మైనర్పై గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు .. జీవితఖైదు పడిన హత్యాకేసు నేరస్థుడు
12ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి దారుణంగా దాడి చేసిన విషయం తెలిసిందే. పశ్చిమ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన లో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో 12 ఏళ్ల బాలికను దారుణంగా లైంగిక వేధింపులకు గురిచేసిన ఒక వ్యక్తి 2006లో ఢిల్లీలోని సుల్తాన్ పురి లో ఇరవై తొమ్మిదేళ్ళ ఒక మహిళను హత్య చేసిన నేరస్తుడు. ప్రస్తుతం కేసులో నిందితుడిగా ఉన్న క్రిషన్ కుమార్ అనే వ్యక్తికి 2006లో హత్య నేరంపై జీవిత ఖైదు విధించబడింది కానీ సత్ప్రవర్తన కారణంగా 2014లో ఆయనను జైలునుండి విడుదల చేశారు.
ప్రస్తుతం కేసులో 12 ఏళ్ల బాలిక ప్రతిఘటించిన ప్పటికీ 33 ఏళ్ల సదరు నిందితుడు ఆమెపై దాడి చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మంగోల్ పురి నివాసి అయిన నిందితుడు చిన్నప్పట్నుంచి చదువు మానేసి, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసై, దొంగతనాలకు అలవాటు పడ్డాడు. దొంగతనాలు చేసే క్రమంలో హత్యకు పాల్పడ్డాడు. ఆ హత్య కేసులోనే అతనికి కోర్టు జీవిత ఖైదు విధించింది. తీహార్ జైల్లో ఉన్న ఈ నేరస్తుడిని ఎనిమిది సంవత్సరాల తర్వాత సత్ప్రవర్తన ఖైదీగా పరిగణించి విడుదల చేశారు. కానీ అతను బయటకు వచ్చిన తర్వాత కూడా తన బుద్ధిని మార్చుకోలేదు. 2016లో దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత తన బంధువు హత్యాయత్నం కేసులో కూడా తనను అరెస్టు చేశారు. ప్రస్తుతం 12 ఏళ్ల బాలిక అత్యాచారం కేసులో కీలక నిందితుడిగా ఉన్నాడు.
బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో గమనించిన నలుగురు కామాంధులు బాలిక ఇంట్లోకి వెళ్లి ఆమెను నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడి, ఆపై కత్తులతో పొడిచారు. బాలిక చనిపోయిందని భావించి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బాలిక గాయాలతో బయటకు రావడంతో స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. దోషులు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చూస్తామని చెప్పారు. బాలిక కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయనున్నామని పేర్కొన్నారు.