ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల హీట్: ఎమ్మెల్యేపై దుండగుల దాడి, ప్రత్యర్థుల పనేనని ఆరోపణ, ఆప్ నుంచి బీఎస్పీ
Recommended Video
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సినిమా ట్విస్ట్లను తలపిస్తున్నాయి. గురువారం ప్రచారం ముగియనుండగా ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేపనిలో రాజకీయ పార్టీలో బిజీ బిజీగా ఉన్నాయి. మరోవైపు తమ ప్రత్యర్థులను కొందరు వదలడం లేదు. ఇటీవలే బీఎస్పీ పార్టీలో చేరిన నారాయణ్ దత్ శర్మపై కొందరు దుండగులు దాడి చేయడం కలకలం రేపుతోంది.
ఎమ్మెల్యేపై దాడి..
బుధవారం అర్ధరాత్రి ప్రచారం చేసి ఇంటికొస్తున్న నారాయణ్ దత్ శర్మ వాహనంపై కొందరు దాడి చేశారు. 10 మంది వరకు గల ముఠా శర్మ వాహనంపై దాడికి తెగబడ్డారు. దీంతో కారు అద్దం ధ్వంసమైపోయింది. అద్దంతోపాటు బ్యానెట్ కూడా పాడయ్యింది. తనపై దాడి చేసింది వైరి వర్గాలేనని నారాయణ్ దత్ శర్మ ఆరోపించారు.
టికెట్ నిరాకరణ..
నారాయణ్ దత్ శర్మ్ బదార్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఆయనకు మళ్లీ టికెట్ ఇచ్చేందుకు ఆప్ నిరాకరించింది. దీంతో ఆయన బీఎస్పీలో చేరారు. బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆప్ తరఫున రామ్ సింగ్ నేతాజీ బరిలో ఉన్నారు. మాజీ కాంగ్రెస్ నేత ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఆప్లో చేరారు. ఆయనకే ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ టికెట్ కేటాయించడంతో.. శర్మ బీఎస్పీలో చేరారు.
ఇద్దరికీ నో..
ఢిల్లీ అసెంబ్లీలో 70 స్థానాలు ఉన్నాయి. 2015లో మెజార్టీ సీట్లు సాధించిన ఆప్.. ఈసారి కూడా తిరిగి అధికారం చేపట్టబోతుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. అయితే శర్మతోపాటు మరొక సిట్టింగ్ ఎమ్మెల్యేకు కేజ్రీవాల్ టికెట్ కేటాయించలేదు. దీంతో శర్మ బీఎస్పీలో చేరగా, మరొనేత బీజేపీలో చేరి టికెట్ సంపాదించుకున్నారు.