దైవ దర్శనానికి వస్తే, కొత్త బూట్లు పోయాయి: పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, కేసు నమోదు
న్యూఢిల్లీ: ఇలాంటి కేసులు అరుదు. వినేవారికి కాస్తంత ఆశ్చర్యంగా కూడా అనిపిస్తాయి. స్వామి వారిని దర్శనానికి వెళ్లిన తన కొత్త బూట్లు పోయాయని కేసు పెట్టాడు ఓ వ్యక్తి. దీంతో చేసేదేమీ లేక పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
ఢిల్లీలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ఆలయం కల్కాజీ ఆలయం. ఈ ఆలయానికి కాన్పూర్కు చెందిన అన్షల్ గుప్తా అనే వ్యక్తి తన కుమారుడు, భార్యతో కలిసి దర్శనానికి వచ్చాడు. ఆలయంలోకి వెళ్లడానికి ముందు బయట ఉన్న షూ కౌంటర్లో బూట్లు విడిచి టోకెన్ తీసుకొని లోపలికి వెళ్లాడు.
దర్శనం ముగించుకొని అరగంట తర్వాత తిరిగొచ్చిన షూ కౌంటర్ నిర్వహకుడు కేవలం తన భార్య, కుమారుని బూట్లు మాత్రమే ఇచ్చాడు. అతడికి బూట్లు కనిపించ లేదు. దీంతో అసహనానికి, ఆగ్రహానికి గురైన గుప్త తనతో పాటు షూ నిర్వాహకుడిని పోలీసు స్టేషన్కు తీసుకెళ్లాడు.
తనవి ఎంతో బ్రాండ్ షూ అని, కొత్తగా కొన్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తుని ప్రారంభించారు. ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.