వార్నీ... చదివేది నర్సరీ... ప్రవేశాలు వెబ్ సైట్ లో చూసుకోవాలా?
ఢిల్లీలో నర్సరీ తరగతిలో ప్రవేశాల ఫలితాలు కూడా వెబ్ సైట్లలో చూసుకోవాల్సి వస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం పకడ్బందీగా నియమాలు రూపొందించి అమలు చేస్తోంది.
ఢిల్లీ: హాల్ టిక్కెట్లను ఆన్ లైన్ లో డౌన్లోడ్ చేసుకోవడం.. ఫలితాలను వెబ్ సైట్ లో చూసుకోవడం.. పిల్లలు ఉన్నత విద్యకు వచ్చాక తప్పదు. కానీ ఢిల్లీలో మాత్రం నర్సరీ తరగతిలో ప్రవేశాల ఫలితాలు కూడా వెబ్ సైట్లలో చూసుకోవాల్సి వస్తోంది.
నర్సరీ ప్రవేశాలకు సంబంధించి తొలి దశ ఫలితాలను ఆయా పాఠశాలల వెబ్ సైట్లలో చూసుకోవలసిందిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని 1700 ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ ప్రవేశాలు నిర్వహించారు.
లక్షా ఇరవై ఐదు వేల సీట్ల కోసం ఏటా దాదాపు లక్షా యాభై వేల దరఖాస్తులు అందుతాయని ప్రభుత్వం పేర్కొంది. ఏటా చివరి నిమిషంలో ఏదో ఒక గందరగోళం జరగడం, కోర్టుకు వెళ్లడం ఆనవాయితీగా మారడంతో అడ్మిషన్ల ప్రక్రియ వివాదాస్పదమవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రభుత్వం పకడ్బందీగా నియమాలు రూపొందించి అమలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో తమ చిన్నారికి ప్రవేశం లభించిందీ లేనిదీ తెలుసుకోవడానికి తల్లిదండ్రులు తాము దరఖాస్తు చేసిన పాఠశాలల వెబ్ సైట్లలో చూసుకోవాలని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
ఢిల్లీ పాఠశాలల్లో నర్సరీ ప్రవేశాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు నియమాలు రూపొందించింది. స్కూలుకు దగ్గరగా నివసించడం, ఆడపిల్ల, తోబుట్టువులు ఇప్పటికే స్కూల్లో ఉండడం.. తదితర అంశాలకు పాయింట్లు కేటాయించింది. ఆ పాయింట్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఎక్కువ మందికి ఒకేలాంటి పాయింట్లు వస్తే లాటరీ తీస్తారు. ప్రస్తుతం ఈ పాయింట్ల ఆధారంగా ఫలితాలను వెబ్ సైట్లలో ఉంచారు. అవసరమైన వారికి మార్చి 3న లాటరీ తీస్తారు. 7న ఆయా పాఠశాలల్లో ప్రవేశం లభించిన విద్యార్థుల జాబితా ప్రకటిస్తారు.
మొత్తం ప్రవేశాల విధానం పారదర్శకంగా జరగడానికి అన్ని దశలనూ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాల పిల్లల ప్రవేశాలకు సంబంధించిన జాబితాను ప్రభుత్వం మార్చి 7న విడుదల చేయనుంది.