మొబైల్ నంబర్ ఇవ్వండి.. నో చెప్పడంతో వాగ్వివాదం, ఆఫీసు ధ్వంసం...
దేశ రాజధానిలో దుండగులు రెచ్చిపోయారు. కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత ఆదిర్ రంజన్ చౌదరి ఆఫీసు వద్ద బీభత్సం సృష్టించారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు వచ్చిన నలుగురు.. చౌదరి గురించి ఆరా తీశారు. తర్వాత అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తర్వాత ఆఫీసు కార్యాలయం ధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఘటనపై ఆదిర్ రంజన్ చౌదరి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆఫీసుకు వచ్చిన దుండగులు అతని మొబైల్ నంబర్ ఇవ్వాలని అడిగారు. అయితే అందుకు సిబ్బంది నిరాకరించడంతో గొడవకు దిగారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి.. సిబ్బందిపై చేయిచేసుకున్నారు. ఆదిర్ వ్యక్తిగత కార్యదర్శి రాజ్ పండిట్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేసిన దుండగులను గుర్తించేపనిలో బిజీగా ఉన్నారు.
సోమవారం పార్లమెంట్ సమావేశంలో ఆదిర్ రంజన్ చౌదరి.. ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్లపై చర్చకు పట్టుబట్టారు. ఇప్పటికే 47 మంది చనిపోవడంతో సమస్య తీవ్రత దృష్ట్యా అనుమతించాలని స్పీకర్ను కోరారు. అయితే అందుకు ఓం బిర్లా నిరాకరించారు. హోలీ తర్వాత లోక్ సభలో చర్చిద్దామని స్పీకర్ చెప్పారని పేర్కొన్నారు. ఇది సరికాదని.. హోలీ తర్వాతే ఎందుకు అని.. ఇప్పుడు చర్చించాలని పట్టుబట్టారు. అధికార పార్టీ మాత్రం సమస్యపై చర్చించకుండా పారిపోయే ప్రయత్నం చేస్తుందని ఆదిర్ రంజన్ చౌదరి విమర్శలు గుప్పించారు.