న్యూ ఇయర్ ఎఫెక్ట్: ఢిల్లీలో భారీగా స్తంభించిన ట్రాఫిక్
ఢిల్లీ: నూతన సంవత్సరం సందర్భంగా దేశరాజధాని ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇండియా గేట్ సమీప ప్రాంతాలన్నీ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వాహనాలతో నిండిపోయాయి. కొత్త సంవత్సరం వేళ ప్రజలందరూ చలిలో ట్రాఫిక్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
న్యూఇయర్ సందర్భంగా దాదాపు లక్ష మంది సందర్శకులు ఇండియా గేట్ను సందర్శించేందుకు వెళ్లారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్రాఫిక్తో నిండిపోయింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది వాహనాలను తొలగించేందుకు తంటాలు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్పై ఢిల్లీ వాసులు పోలీసులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొత్త సంవత్సరం వేళ ట్రాఫిక్ను నియంత్రించలేకపోయారంటూ సోషల్మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు.. మధ్యాహ్నం నుంచి రోడ్ల మీదే ఉన్నాం. అధికారులకు ఏమీ పట్టదా? అరగంటలో చేరుకోవాల్సిన దూరాన్ని రెండున్నర గంటల్లో చేరుకున్నాం' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
'ఖాన్ మార్కెట్ దగ్గర చిక్కుకుపోయాం.. ఎటూ వెళ్లడానికి దారి లేకుండా పోయింది' అంటూ మరో నెటిజన్లు ట్విట్టర్ ద్వారా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మండి హౌస్ సర్కిల్ వద్ద ట్రాఫిక్లో అంబులెన్స్ ఇరుక్కుపోయింది. కనీసం అంబులెన్స్ వెళ్లేందుకు కూడా దారి లేనంతగా వాహనాలు ఉన్నాయి. ఐటీవో, ఢిల్లీ-నోయిడా.. తదితర ప్రాంతాల్లోను ఇదే పరిస్థితి ఉంది. ప్రయాణికులు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ట్రాఫిక్ సిబ్బంది మాత్రం ఎక్కడా కనిపించడం లేదని మండిపడుతున్నారు.