గ్యాంగ్ స్టర్ నీరజ్ అరెస్టు: అబుసలేం శిష్యుడు
ఢిల్లీ: మాఫియా ముఠా నాయకుడు నీరజ్ బవానాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నీరజ్ మీద హత్యలు, హత్యాయత్నాలు, దోపిడిలు, బెదిరింపులతో పాటు డజన్లలో అనేక కేసులు నమోదు అయ్యాయని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవత్సవా చెప్పారు.
మాఫియా ముఠా నాయకుడు అబు సలేం శిష్యుడు నీరజ్. అబుసలేంకు ముంబాయి కోర్టు జైలు శిక్ష విదించిన విషయం తెలిసిందే. తరువాత జైలులో ఉన్న అబుసలేం ఆదేశాల మేరకు నీరజ్ క్రిమినల్ కార్యాకలాపాలు సాగిస్తున్నాడు.
వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలను గుర్తించి వారి ఫోన్ నెంబర్లు తెలుసుకుని మామూళ్లు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. అడిగినంత నగదు ఇవ్వకుంటే చంపేస్తాం అని బెదిరిస్తున్నారు. ఎదురు తిరిగిన వారిని రివాల్వర్ లతో కాల్చి హత్య చేస్తున్నారు.
మంగళవారం వేకువ జామున 3.45 గంటల సమయంలో వ్యాపారవేత్తను హత్య చెయ్యడానికి నీరజ్ బయలుదేరాడు. విషయం పసిగట్టిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఢిల్లీలోని ముండా రోడ్డులో మకాం వేసి నీరజ్ ను అరెస్టు చేశారు.
ఢిల్లీ నగరంతో పాటు ఇతని మీద అనేక రాష్ట్రాలలో పలు కేసులు నమోదు అయ్యాయని, మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఇతని పేరు ఉందని ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ కమిషనర్ శ్రీవత్సవా అంటున్నారు. గత సంవత్సరం నీరజ్ సోదరుడు రాజేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజేష్ జైలులో ఉన్నాడు. నీరజ్ ను విచారణ చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.